రోడ్డు గాయబ్...దారేదీ మహా ప్రభో అంటున్న జనం...?

Update: 2022-04-04 08:57 GMT
వస్తువు అయితే మాయం అవుతుంది. బంగారమో, ధనమో మరోటో అయితే మటు మాయం అవుతుంది. దాని మీద పొలీసులకు ప్రతీ రోజూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూంటాయి. మరి ఒక రోడ్డు మాయం కావడం ఎవరైనా చూశారా. అసలు ఆ మాట ఎన్నడైనా విన్నారా. అవును ఇది నిజంగా వింతే. కానీ ఈ వింతలోనూ ఎంతో చింత ఉంది.

రోడ్డు అంటే ఎవరికీ మామూలుగా అయితే పట్టదు కానీ ఆ రోడ్డే లేకపోతే. ఒక్క క్షణం దీని మీద ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది. రోడ్డు ఉంటేనే కదా అందరూ  నడచి వెళ్లేది. గమ్యానికి చేరుకునేది. తాను అలా అక్కడే ఉంటూ ఎంతో మంది ఎదుగుదలను చూస్తూ దారి చూపించేది రోడ్డు.

అలాంటి రోడ్డు లేక ఇపుడు ఒక గ్రామం మొత్తం అల్లాడుతోంది అంటే అది చాలా సీరియస్ మ్యాటరే. పోనీ వారికి ఏళ్ళకు ఏళ్ళుగా రోడ్డు లేదా అంటే. ఇంత వరకూ ఉంది, ఇపుడు లేదు, మరి అలా ఎందుకు జరిగింది, ఇపుడే ఎందుకు మాయం అయింది అంటే చాలా ఆసక్తికరమైన కధ తెలుసుకోవాల్సిందే.

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగవ వార్డు అది. అక్కడ జయంతి వారి అగ్రహారం కల్లాలు అనే ఊరు ఉండేది. ఆ ఊరికి నేరుగా రోడ్డు ఉంది. ఆ రోడ్డు భీమిలీ దొరతోట దాకా తీసుకెళ్తుంది. బస్సులు, ఇతర రవాణా సదుపాయాలు అక్కడికి వస్తేనే అందుబాటులో ఉంటాయి.

విశాఖ వెళ్లాలీ అన్నఆ రోడ్డు మీదనే నడచి వచ్చి మెయిన్ రోడ్డును చేరుకోవాలి. అయితే ఏళ్లకు ఏళ్లుగా ఇక్కడ సర్కార్ వారి స్థలంలో రోడ్డు లేదు. ఒక ప్రైవేట్ బాట మాత్రమే ఉంది. దాన్నే రోడ్డుగా చేసుకుని ఈ గ్రామస్తులు రాకపోకలు సాగించేవారు. ఇక విశాఖ గ్రేటర్ సిటీగా మారాక అందులోకి భీమిలీ వచ్చి కలిశాక ఊరు దశ మారిపోయింది. భూములకు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది.

అలా జయంతివారి అగ్రహారం కల్లాలు సమీపంలో సాగు భూములు అన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా భవనాలు  అయ్యాయి. నివాశాలుగా మారిపోయాయి. అపుడు వచ్చింది ఈ రోడు సమస్య. ఈ ప్రైవేట్ రోడ్డు స్థలం తనదని చెప్పి దాని యజమాని ప్రహారీ గోడ కట్టేశాడు. అంతే ఒకనాడు పొలం గట్టు పక్కన సన్నని దారిగా ఉన్న రోడ్డు కాస్తా ఇపుడు సిమెంట్ నిర్మాణాల మధ్య దాగుండిపోయింది.

మరి వెనకన ఉన్న ఈ వూరుకు బయటకు రావాలన్నా పోవాలన్నా రోడ్డు ఏది ఏంటే జవాబు లేదు. ప్రైవేట్ స్థలం కాబట్టి రోడ్డుని దాని యజమాని తీసేసుకున్నారు. మరి గ్రామస్థులు మొత్తానికి రోడ్డు ఒకటి ఏర్పాటు చేయాలి కదా. ఇదే జయంతి వారి అగ్రహారం జనాల ఆవేదన, నివేదన కూడా.

ఈ రోడ్డు కోసం తాము చాలా కాలంగా అడుగుతున్నా జవాబు అయితే లేదని వారు వాపోతున్నారు. చిత్రమేంటి అంటే భీమిలీ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న అవంతి శ్రీనివాసరావు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. మరి జీవీఎంసీలో వైసీపీయే గెలిచింది. ఇలా అన్ని విధాలుగా అధికార పార్టీకి అండగా ఉన్న తమకు ఒక దారిని చూపించరేమని గ్రామస్తులు అంటున్నారు. మొత్తానికి వారికి ఒక దారి కావాలి. పోయిన రోడ్డు కావాలి. ఎవరైనా చూపగలరా. ఏమో చూడాలి.
Tags:    

Similar News