మహిళల ప్రీమియర్ లీగ్ లో తెలుగమ్మాయి రనౌట్ రగడ.. ముంబై అందుకే ఓడిందా?
నాలుగైదేళ్ల కిందట మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ మొదట్లో సాధారణంగా అనిపించినా క్రమంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి సీజన్ లలో మూడు జట్లే ఉన్నా ఇప్పుడు ఐదుకు పెరిగాయి.
నాలుగైదేళ్ల కిందట మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ మొదట్లో సాధారణంగా అనిపించినా క్రమంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలి సీజన్ లలో మూడు జట్లే ఉన్నా ఇప్పుడు ఐదుకు పెరిగాయి. ఇక శనివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బంతికి గెలిచింది. అయితే, దీనిపై తీవ్ర వివాదం రేగుతోంది. చివరకు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఇంతకూ ఏం జరిగిందంటే..?
మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబూ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చివరి ఓవర్ ఆఖరి బంతికి విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ముంబై బౌలర్ సజనా వేసిన బంతిని ఢిల్లీ బ్యాటర్ అయిన తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కవర్స్ మీదుగా షాట్ కొట్టింది. అయితే, వెటరన్ క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్ వెనక్కి పరుగెత్తి బంతిని అందుకొని విసరగా.. కీపర్ అందుకొని వికెట్లను గిరాటేసింది. కానీ, రెండో పరుగుకు అరుంధతి వచ్చేసింది. రనౌట్ అయినట్లు ముంబై ప్లేయర్లు సంతోషంలో ముగినిపోయారు. థర్డ్ అంపైర్ సమీక్షలో స్టంప్స్ ను బంతి తాకినప్పుడు లైట్లు వెలిగాయి. కానీ, స్ట్రైకర్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చేటప్పటికి బెయిల్స్ పైకి లేవలేదు. దీంతో రనౌట్ గా పరిగణించలేదు. చివరి బంతికి రెండు పరుగులు పూర్తి చేసి ఢిల్లీ గట్టెక్కింది.
తమ అభిమాన జట్టు ఓటమికి థర్డ్ అంపైర్ నిర్ణయం కారణమని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. థర్డ్ అంపైర్ ఏం చూసినట్లు అని నిలదీస్తున్నారు. ఎల్ఈడీ లైట్లను వినియోగించినప్పుడు బెయిల్స్ పడితేనే ఔట్ ఇస్తామనే నిబంధనను ఇక ఎందుకని ప్రశ్నిస్తున్నారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో సూపర్ ఓవర్ ను చూసే అవకాశం చేజారిందని మరికొందరు కామెంట్ చేశారు.