ఇద్దరు స్టార్ బ్యాటర్ల కాంట్రాక్టులు డౌన్.. ఎ ప్లస్ నుంచి ఎ లోకి
ఇద్దరు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ కు బీసీసీఐ కాంట్రాక్టులు డౌన్ కానున్నాయి.. భారత క్రికెట్ లో నాలుగు రకాల కాంట్రాక్టులు ఉన్నాయి.;

ఇద్దరు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ కు బీసీసీఐ కాంట్రాక్టులు డౌన్ కానున్నాయి.. భారత క్రికెట్ లో నాలుగు రకాల కాంట్రాక్టులు ఉన్నాయి. అవి ఎ ప్లస్, ఎ, బి, సి. అత్యుత్తమ క్రికెటర్లకు మాత్రమే ఎ ప్లస్ లో చోటిస్తారు. వీరు మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టి20)లోనూ సభ్యులై ఉంటేనే ఎ ప్లస్ కాంట్రాక్టు దక్కుతుంది. ఇప్పటివరకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు ఈ కేటగిరీలో చోటుంది.
కాగా, ఇకమీదట ప్రకటించబోచే కాంట్రాక్టుల్లో మార్పులు జరగనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదికి గాను బీసీసీఐ త్వరలో సెంట్రల్ కాంట్రాక్టులు వెల్లడించనుంది. ఇందులో రోహిత్, కోహ్లి, జడేజాల గ్రేడ్ తగ్గనుంది. వీరిని ఎ ప్లస్ నుంచి ఎ లోకి చేర్చనున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది టి20 ప్రపంచ కప్ నెగ్గిన అనంతరం కోహ్లి, రోహిత్, జడేజా ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. వీరు వన్డేలు, టెస్టులకే అందుబాటులో ఉన్నందున ఎ ప్లస్ ఇవ్వబోరు. మూడు ఫార్మాట్లలోనూ ఆడేవారికే ఈ గ్రేడ్ దక్కుతుంది.
రేపు తేలుతుందా..?
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ శనివారం గువాహటిలో సమావేశం కానుంది. పురుషుల సెంట్రల్ కాంట్రాక్ట్ ను వెల్లడించే అవకాశం ఉంది. జూన్ లో మొదలయ్యే ఇంగ్లండ్ పర్యటనకు జట్టు ఎంపిక పైనా చర్చించనున్నారు. కాగా, ఎ ప్లస్ లో బుమ్రా మాత్రమే మిగులుతుండగా శుబ్ మన్ గిల్ సహా కొందరికి అందులో కొత్తగా చోటివ్వచ్చు.
ఇక బీసీసీఐ క్రమశిక్షణ చర్యలతో సెంట్రల్ కాంట్రాక్ట్ పోగొట్టుకున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లకు కొత్తగా కాంట్రాక్టులు రానున్నాయి. అయ్యర్ చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు. అతడి పేరు చేర్చడం ఖాయం. ఇషాన్ గురించి కాస్త జరగొచ్చు.
యవ ఆల్ రౌండర్ నితీష్ కుమార్రెడ్డి, ఓపెనింగ్ సంచలనం అభిషేక్ శర్మలకు కొత్తగా కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉంది.