నయనతార గురించి నాకెందుకూ? .. నా పని నేను చేసుకుంటా!

Update: 2022-08-09 23:30 GMT
కోలీవుడ్లో ఇంతవరకూ సీనియర్ స్టార్ హీరోల ఫ్యామిలీల నుంచి వారసులుగా హీరోలు మాత్రమే వచ్చారు. హీరోయిన్స్ గా వచ్చినవారిలో శ్రుతి హాసన్ .. వరలక్ష్మి శరత్ కుమార్ .. ఐశ్వర్య అర్జున్ మాత్రమే కనిపిస్తారు. సాధారణంగా తమ హీరో కూతురు వేరే హీరోతో ఆడిపాడటానికి అప్పట్లో అభిమానులు ఒప్పుకునేవారు కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు గనుక, సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు కూడా హీరోయిన్స్ గా కెమెరా ముందుకు వస్తున్నారు. అవకాశాలను బట్టి పొరుగు రాష్ట్రాలకు కూడా వెళుతున్నారు.

ఇక సీనియర్ స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్ కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ సౌత్ ఇండియా సినిమాను ప్రపంచపటానికి పరిచయం చేసిన శంకర్ ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ రావడమనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. శంకర్ కూతురు 'అదితి శంకర్' డాక్టర్ డిగ్రీని పూర్తిచేసింది.

ఆ రూట్లోనే ఆమె వెళుతుందని అంతా అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆమె హీరోయిన్ గా కెమెరా ముందుకు రావడంతో అందరూ షాక్ అయ్యారు. కార్తి హీరోగా రూపొందిన 'విరుమన్' సినిమాతో ఆమె కోలీవుడ్ తెరకి పరిచయమవుతోంది.

'విరుమన్' సినిమాను ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో అదితి శంకర్ మాట్లాడుతూ .. " చాలామంది డాక్టర్ కాబోయి .. యాక్టర్ ను అయ్యానని చెబుతుంటారు. కానీ నేను డాక్టర్ అయిన తరువాతనే సినిమాల్లోకి వచ్చాను. మొదటి నుంచి కూడా నాకు సినిమాలు అంటే ఇష్టం. అందువల్లనే నా ఇంట్రస్ట్ ను గురించి ఒక రోజున నాన్నతో చెప్పాను. ఇక్కడ సక్సెస్ కాకపోతే డాక్టర్ గానే నా కెరియర్ కొనసాగుతుందని అన్నాను. అందుకు ఆయన అంగీకరించారు.

నేను సినిమాల్లో చేయాలనుకోగానే నిర్మాతలుగా అవకాశం ఇచ్చిన సూర్య -  జ్యోతిక గార్లకు థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే నేను హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్న కార్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఇక ఈ సినిమాలో 'మధురై' యువతిగా నాతో చేయించిన ముత్తయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నయనతార స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో వచ్చారా? ఆమె స్థానాన్ని దక్కించుకోగలరా? అని చాలామంది అడుగుతున్నారు. నాకు అంకెలపై నమ్మకం లేదు .. అంకితభావంతో పనిచేయాలని మాత్రమే వచ్చాను" అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News