సుకుమార్ 'పుష్ప' స్టోరీని వేంపల్లి రచన నుంచి ఎత్తేశాడా...?

Update: 2020-08-26 12:10 GMT
స్టార్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''పుష్ప''. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే 'పుష్ప' నుండి రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మొరటు కుర్రాడిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. అయితే క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న సుకుమార్.. ఇప్పుడు 'పుష్ప' స్టోరీని కాపీ చేసాడనే ఆరోపణలు వస్తున్నాయి.

కాగా ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ యువ పురష్కార గ్రహీత డా. వేంపల్లి గంగాధర్ 'పుష్ప' సినిమాని ఉద్దేశిస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ''సూచన అనుకోండి.. సలహా అనుకోండి. ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి. ముందుగానే రాసి పెట్టిన కథను, పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి. తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి. సాక్షి ఆదివారం అనుబంధం( 04 నవంబర్ 2018)లో నేను రాసిన 'తమిళ కూలీ' కథ మొత్తం వాడేసుకోండి. 2019 మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం 'ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు' ను ఉడికించి వంట చేస్కోండి. కనీసం పేరు కూడా రిఫరెన్స్ గా సినిమాలో వేయకండి. ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి.. మా తెలుగు సాహిత్యకారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం'' అంటూ ఘాటైన పోస్ట్ పెట్టారు వేంపల్లి. దీనికి 'పుష్ప' ఫస్ట్ లుక్ మరియు సాక్షి పేపర్ కటింగ్ తో పాటు 'ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు'కు సంబంధించిన ఫోటోలను కూడా జత చేశారు.

సినీ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమ సినిమాల విషయంలో స్టోరీ లైన్ లేదా కొన్ని ఎపిసోడ్స్ వంటివి అనుకరణ చేయడమో లేదా ఎక్కడో ఒకచోట ప్రేరణలు పొందుతుంటారనే అపవాదు ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు 'పుష్ప' స్టోరీ కూడా తన పుస్తకం మరియు వ్యాసాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని వేంపల్లి గంగాధర్ ఆరోపిస్తున్నట్లు అర్థం అవుతోంది. గతంలో కూడా వేంపల్లి రచించిన 'మొండి కత్తి'ని ప్రేరణగా తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రాన్ని తీసాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి వేంపల్లి రచన ప్రేరణతో సుకుమార్ 'పుష్ప' సినిమాని తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై 'పుష్ప' మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉండగా వేంపల్లి గంగాధర్ పెట్టిన పోస్ట్ కు సోషల్ మీడియాలో నెటిజన్స్ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంపై వీలైనంత త్వరగా ఫిలిం ఛాంబర్ లో సంప్రదించమని.. న్యాయం పోరాటం చేయమని సూచిస్తున్నారు. మరికొందరు అతనికి కాపీ చేయడం అలవాటుగా మారిందని.. కోర్టుకు లాగి అతని నిజస్వరూపం ప్రపంచానికి తెలిసేలా చేయమని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇది సుకుమార్ లాంగ్ బ్యాక్ స్టోరీ అని.. అతని టీమ్ చాలా ఏళ్లుగా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని.. సినిమా రిలీజవ్వకుండానే అది మీ స్టోరీ అని ఎలా చెప్పగలరని.. ఒకవేళ నిజంగా మీ స్టోరీ నుంచి కాపీ చేసి ఉంటే ప్రాపర్ గా మీ రైట్స్ కోసం ఫైట్ చేయాలని సలహా ఇస్తున్నారు.
Tags:    

Similar News