అమ్మడి బ్లౌజ్.. కేసు వరకూ వెళ్లింది

Update: 2019-11-22 06:55 GMT
కాలం మారుతున్న కొద్దీ.. విశ్వాసాలు.. సెంటిమెంట్లు అంతంతకూ సున్నితమవుతున్నాయి. గతంలో మాదిరి పరిస్థితులు లేవు. ఈ విషయాల్లో ప్రముఖులు.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. ఇలాంటి అంశాల్లో పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ ఇప్పుడు అలాంటి వివాదంలోనే చిక్కుకుంది.  తాజాగా ఆమె ధరించిన బ్లౌజ్ వివాదంగా మారటమే కాదు.. కేసు వరకూ వెళ్లింది.

ఇటీవల ఆమె ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. అందులో లైట్ పింక్ కలర్ తో ఉన్న దుస్తుల్ని ధరించింది. మరీ.. ముఖ్యంగా ఆమె ధరించిన మోడ్రన్ బ్లౌజ్ ఇప్పుడు వివాదానికి కారణంగా మారింది. ఆందాల్ని ఆరబోస్తూ షూట్ చేసిన బ్లౌజ్ మీద హిందువులు పవిత్రంగా పూజించే శ్రీరాముడి పేరు రాసుండటంతో ఇదో వివాదంగా మారింది.

ఆమె ధరించిన బ్లౌజ్ మొత్తం శ్రీరాముడి పేరు మీద ఉండటంతో.. హిందూ సంప్రదాయాన్ని మంటగలిపేలా ఉందని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఆమె ఫోటోపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ముంబయికి చెందిన ఒక వ్యక్తి ఎమ్ ఎన్ జోషి మార్గ్ పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

వాణికపూర్ ధరించిన బ్లౌజ్ హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో.. అతగాడి ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. మరోవైపు.. తాను ధరించిన బ్లౌజ్ వ్యవహారం రచ్చగా మారటంతో సోషల్ మీడియాలో తాను పోస్టు చేసిన ఫోటోలను డిలీట్ చేశారు. చిన్నపాటి విషయం కూడా పెను వివాదంగా మారుతున్న వేళ.. ఇలాంటివి నెత్తి మీదకు తెచ్చుకునేలా వ్యవహరించటం ఏమిటన్న ప్రశ్నకు వాణీ కపూర్ ఏమని బదులిస్తారో?
Tags:    

Similar News