తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడితో మెగా ప్రిన్స్..?

Update: 2022-09-01 01:30 GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓవైపు విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ చిత్రాలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'గని' మూవీతో ప్లాప్ అందుకున్న వరుణ్.. 'ఎఫ్ 3' సినిమాతో సక్సెస్ సాధించాడు.

వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు.

#VT12 రెగ్యులర్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. కింగ్ అక్కినేని నాగార్జున తో 'ది ఘోస్ట్' సినిమాని రిలీజ్ కు రెడీ చేసిన ప్రవీణ్ సత్తారు.. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే తాజా ఊహాగానాల ప్రకారం వరుణ్ తేజ్ మరో కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ తో గుర్తింపు తెచ్చుకున్న గిరీశయ్య ఇటీవల స్క్రిప్ట్ వినిపించాడట. దీనికి మెగా హీరో సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు టాక్.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య తెరకెక్కించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా విడుదలకు సిద్ధమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఎస్వీసీ బ్యానర్ లోనే దర్శకుడు మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యారని తెలుస్తోంది.

అన్నీ కుదిరితే వరుణ్ తేజ్ మరియు గిరీశయ్య కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని.. దీన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ బ్యాంక్రోల్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. 'రంగ రంగ వైభవంగా' విడుదలైన తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ త్వరలో పాన్ ఇండియా బాట పట్టనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీని కోసం సోనీ పిక్చర్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ ఏడాది వరుణ్ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందేమో వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News