గోపీచంద్ వదులుకున్న ఒక్కడు

Update: 2022-07-04 06:20 GMT
హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఆ తర్వాత విలన్ పాత్రలు వేసి.. మళ్లీ హీరోగా అవకాశం అందుకుని నిలదొక్కుకున్న నటుడు గోపీచంద్. తండ్రి, దిగ్గజ దర్శకుడు టి.కృష్ణకు ఉన్న పేరు వల్ల 'తొలి వలపు' చిత్రంతో టాలీవుడ్లోకి ఈజీగానే ఎంట్రీ దొరికింది కానీ.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కెరీర్ ఆరంభంలోనే పెద్ద బ్రేక్ పడింది గోపీకి.

ఈ స్థితిలో అతను 'జయం'తో విలన్ అవతారం ఎత్తాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. గోపీకి మంచి పేరొచ్చింది. ఆపై వర్షం, నిజం చిత్రాలతోనూ విలన్‌గా మెప్పించాడు. ఆ తర్వాత 'యజ్ఞం'తో హీరోగా రీఎంట్రీ ఇచ్చి విజయాన్నందుకున్నాడు. తర్వాత మళ్లీ విలన్ పాత్ర వేయాల్సిన అవసరం రాలేదు.

తాజాగా 'పక్కా కమర్షియల్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన గోపీచంద్.. కెరీర్లో తాను కోల్పోయిన ఒక మంచి అవకాశం గురించి, అలాగే తనను వెతుక్కుంటూ వచ్చిన ఒక గొప్ప ఛాన్స్ గురించి ఓ టీవీ కార్యక్రమంలో పంచుకున్నాడు.

మహేష్ బాబుతో 'నిజం' చేశాక.. అతనే హీరోగా తెరకెక్కిన 'ఒక్కడు' సినిమాలోనూ తాను విలన్‌గా నటించాల్సిందని గోపీచంద్ వెల్లడించాడు. ఆ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేసిన ఓబుల్ రెడ్డి పాత్రను తాను చేయాల్సిందన్నాడు. ముందు ప్రకాష్ రాజ్‌ కోసమే ఈ పాత్రను సిద్ధం చేసినప్పటికీ.. ఆయనకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో తనను అడిగారని, పాత్ర నచ్చి తాను కూడా ఓకే చెప్పానని తెలిపాడు.

కానీ కొన్ని రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ డేట్లు సర్దుబాటు చేయడంతో ఆయనే ఈ పాత్ర చేశాడని, తాను అందుకేమీ ఫీలవ్వలేదని గోపీ తెలిపాడు. దాని కంటే ముందు 'తొలి వలపు' ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉన్న తనకు తేజ ఫోన్ చేసి 'జయం'లో ఒక చిన్న సన్నివేశం చెప్పారని.. వెంటనే అందులో విలన్ పాత్రకు ఓకే చెప్పగా.. మరుసటి రోజే షూటింగ్ ప్రారంభించేశారని గుర్తు చేసుకున్నాడు గోపీ.

విలన్ పాత్రలు వేశాక తిరిగి హీరో కావడం కూడా అనుకోకుండా జరిగిందని గోపీ చెప్పాడు. 'యజ్ఞం' కథను ముందు ప్రభాస్‌కు చెప్పారని.. అనుభవం లేని దర్శకుడన్న కారణంతో అతను ఈ సినిమా చేయలేదని, తర్వాత కళ్యాణ్ రామ్ వద్దకు ఈ కథ వెళ్లగా అతను కూడా ఓకే చేయలేదని.. చివరికి పోకూరి బాబూరావు పిలిచి తనను ఈ సినిమా చేస్తావా అని అడగడంతో సరే అన్నానని.. అలా ఆ సినిమా ఛాన్స్ తనను వెతుక్కుంటూ వచ్చి తన కెరీర్‌ను మలుపు తిప్పిందని గోపీచంద్ తెలిపాడు.
Tags:    

Similar News