మహేష్-క్రిష్.. శివమ్ ఏమైంది?

Update: 2015-10-18 15:30 GMT
‘కృష్ణం వందే జగద్గురుం’ తర్వాత క్రిష్.. మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. ఆ సినిమా టైటిల్ ‘శివమ్’ అని కూడా ప్రచారం జరిగింది. మహేష్, క్రిష్ కలిసి మాట్లాడుకున్నారని.. సినిమా త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని.. వైజయంతీ మూవీస్ ఆ సినిమాను నిర్మిస్తుందని అంతా అనుకుంటుండగా.. ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. క్రిష్ బాలీవుడ్ బాట పట్టాడు. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను డైరెక్ట్ చేశాడు. మరి మధ్యలో ఈ శివమ్ కథ ఏమైంది? ఆ కథ మహేష్‌ కు నచ్చలేదా? సినిమా ఆగిపోవడానికి కారణాలేంటి? ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలే అడిగితే.. క్రిష్ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు.

‘‘అవును అప్పట్లో మహేష్ బాబుకి శివమ్ అనే కథ చెప్పాను. ఏ సినిమా ఎందుకు పట్టాలెక్కలేదో చెప్పలేను. ‘కథ చెప్పేటపుడే సినిమా చూసేశా. ఇక సినిమా తీయక్కర్లేదేమో అని మహేష్ తో అన్నా’ను. చివరికి అదే జరిగింది’’ అని నవ్వేశాడు క్రిష్. దీనర్థం ఏంటన్నది మాత్రం ఎవరికి వారు అన్వయించుకోవాలన్నమాట. కథ చెబుతుండగా తనకు కనిపించిన సినిమా ఆశించిన స్థాయిలో లేదని ఆ సినిమా తీయడం మానుకున్నాడా ఏమిటో మరి. మొత్తానికి ఓ అద్భుతమైన కాంబినేషన్ లో  తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. ఐతే క్రిష్ టాలెంటు మీద మాత్రం మహేష్, నమ్రతలకు మహా గురి అట. క్రిష్ ను ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’కు డైరెక్టరుగా పెట్టుకోమని సంజయ్ లీలా బన్సాలీకి చెప్పిందే నమ్రత అట. ఈ సంగతి క్రిష్ స్వయంగా వెల్లడించాడు. తన ‘కంచె’ ట్రైలర్ గురించి కూడా వెంటనే ట్వీట్ చేసి తన పట్ల ఉన్న అభిమానాన్ని మహేష్ చాటుకున్నాడని చెప్పాడు క్రిష్.
Tags:    

Similar News