నటుడు శ్రీరామ్‌ మృతి.. సీఎం దిగ్బ్రాంతి

Update: 2019-12-18 11:06 GMT
మరాఠీ నటుడు డాక్టర్‌ శ్రీరామ్‌ పుణెలోని తన నివాసంలో మృతి చెందారు. 92 ఏళ్ల శ్రీరామ్‌ రంగస్థల నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఎన్నో నాటకాలకు స్క్రీన్‌ ప్లే మరియు దర్శకత్వం అందించిన శ్రీరామ్‌ సినిమాలపై ఆసక్తితో తన డాక్టర్‌ వృత్తిని వదిలేసి పూర్తిగా సినిమాలకే టైం కేటాయించారు. శ్రీరామ్‌ దాదాపు 100 కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన మృతితో మరాఠీ సినీ పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌ మరియు గుజరాతీ సినీ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలోని సతారాలో 1927లో శ్రీరామ్‌ జన్మించారు. చిన్నతనం నుండి నటన మరియు రంగస్థలంపై ఆసక్తిని పెంచుకున్నారు. ఆ ఆసక్తితో నాటకాల్లో నటించే వారు. ఒక వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు నాటకాలు రాసేవారు. ఈఎన్‌ టీ డాక్టర్‌ గా కొంత కాలం చేసిన తర్వాత శ్రీరామ్‌ గారు పూర్తిగా నటనకే సమయం కేటాయించారు.

మరాఠీ.. హిందీ మరియు గుజరాతీ సినిమాల్లో నటించిన శ్రీరామ్‌ ఎన్నో అవార్డులు మరియు రివార్డులు దక్కించుకున్నారు. 1990లలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా శ్రీరామ్‌ చేసిన పాత్రలు ఎప్పటికి గుర్తుండిపోయేలా ఉన్నాయి. 20 మరాఠీ నాటకాలకు దర్శకత్వం వహించిన ఘనత శ్రీరామ్‌ కు దక్కిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామ్‌ కు వయసు కూడా మీద పడటంతో తుది శ్వాస విడిచారు. శ్రీరామ్‌ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tags:    

Similar News