ప్రముఖ నటి మీద పోస్టు పెట్టి.. జైలుపాలైన దర్శకుడు

Update: 2022-05-06 09:30 GMT
మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోలిస్తే మలయాళ చిత్ర పరిశ్రమ కాస్తంత వేరుగా ఉంటుందని చెప్పాలి. దక్షిణాదిలోని మరే చిత్ర పరిశ్రమలో కనిపించని చిత్ర విచిత్రమైన ఉదంతాలు ఇక్కడ చోటు చేసుకుంటాయి.

తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. తాజాగా ప్రముఖ మలయాళ నటి మంజూ వారియర్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో మలయాళ చిత్ర దర్శకుడు సానల్ కుమార్ శశిధరన్ ను పోలీసులు కస్టడీలో తీసుకున్న వైనం సంచలనంగా మారింది.

గతంలో ఇదే దర్శకుడితో మంజూ వారియర్ సినిమాను చేయటం విశేషం. ఇంతకీ.. ఏం నేరం చేశాడని దర్శకుడ్ని పోలీసులు అరెస్టు చేశారన్న విషయంపై ఆరా తీస్తే ఆసక్తికర వివరాలు బయటకు వచ్చాయి. మంజూ వారియర్ వాదనను చూస్తే.. ఆమె శశిధరన్ తో రెండేళ్ల క్రితం కయ్యాట్టం అనే సినిమాను తీశారు. అప్పటి నుంచి ఆమెకు అతడి నుంచి బెదిరింపులు మొదలైనట్లుగాపేర్కొన్నారు.

అయితే.. ఈ నెల ఒకటిన శశిధరన్ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. అందులో ఏమున్నదంటే.. మంజూ వారియర్ జీవితం ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. ఆమె లైఫ్ డేంజర్ లో ఉందని చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదని.. ప్రస్తుతం ఆమె కొందరి అదుపులో ఉందని.. ఆమె విషయాన్ని అందరూ సీరియస్ గా తీసుకోవాలని పేర్కొన్నారు. ఫేస్ బుక్ లో పెట్టిన ఈ పోస్టు వైరల్ గా మారింది.

ఈ పోస్టు మీద సీరియస్ గా స్పందించిన మంజూ వారియర్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇమేజ్ కు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని.. తనను అవమానిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని.. అతడిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మంజూవారియర్ ఫిర్యాదు ఆధారం చేసుకొని దర్శకుడిని అదుపులోకి తీసుకున్నారు.

తాను దర్శకత్వం వహించిన సినిమాలో నటిగా వ్యవహరించిన ఆమె అంతలా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు ఇచ్చేంత పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News