'అప్పు ఎక్స్ ప్రెస్' సేవలకు శ్రీకారం చుట్టిన ప్రకాశ్ రాజ్..!

Update: 2022-08-09 01:30 GMT
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే నటుడాయన. సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నారు.

ప్రకాశ్ రాజ్ తన సేవాగుణంతోనూ అందరి మన్ననలు పొందుతున్నారు. మానవత్వం, దయాగుణానికి నిలువెత్తు రూపంలా ఉండే ఆయన.. ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టి, ఎందరో జీవితాల్లో వెలుగు నింపారు. లాక్ డౌన్ లో వలస కూలీలకు భరోసాగా నిలిచారు. ఈ క్రమంలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం 'అప్పు ఎక్స్‌ ప్రెస్‌' పేరుతో అంబులన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు ప్రకాష్.

కన్నడ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌ కుమార్‌ గతేడాది అక్టోబర్‌ 29న హార్ట్ ఎటాక్ తో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమానికి నాంది పలికారు ప్రకాశ్ రాజ్. నిరు పేదల కోసం కర్ణాటక రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 'అప్పు ఎక్స్‌ ప్రెస్‌' పేరుతో అంబులెన్స్‌ సేవలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగా ప్రకాశ్‌ రాజ్‌ మొదటగా మైసూరు నగరంలోని మిషన్‌ ఆస్పత్రికి 'అప్పు ఎక్స్‌ ప్రెస్‌' అంబులెన్స్‌ ను అందజేయడం జరిగింది. ఈ మేరకు ట్విటర్‌ లో ఒక పోస్ట్ పెట్టారు. ""APPU Xpress "" మా ప్రియమైన పునీత్‌ రాజ్‌ కుమార్ జ్ఞాపకార్థం నిరుపేదల కోసం ఉచిత అంబులెన్స్‌ ను విరాళంగా అందించింది. జీవితాన్ని తిరిగి ఇవ్వడంలో ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్ ఆనందం పొందుతుంది అని వర్సటైల్ యాక్టర్ పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ చొరవకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

కాగా, పునీత్ మరణించి నెలలు గడిచిపోతున్నా.. సినీ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పు ఇంత తక్కువ వయసులో ఈ లోకాన్ని విడిచిపోవడాన్ని తట్టుకోలేకపోయారు. సినీ ప్రముఖులు సైతం ఎప్పటికప్పుడు పునీత్ ను తల్చుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే విశాల్ లాంటి కొందరు ఆయన పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ కూడా దివంగత నటుడి పేరుతో అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు.

ఇక ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కాలంలో 'కేజీఎఫ్: చాప్టర్ 2' 'మేజర్' చిత్రాల్లో మంచి పాత్రల్లో మెరిసారు. ఇప్పుడు లేటెస్టుగా 'సీతా రామం' సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. రాబోయే 'తిరుచిత్రంబలం' 'శాకుంతలం' 'విరుమాన్' 'పొన్నియన్ సెల్వన్' 'కబ్జా' వంటి చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.
Tags:    

Similar News