ఆ స‌మ‌యంలో తుపాకి ఉండి ఉంటే

Update: 2019-12-09 13:52 GMT
దిశ ఘ‌ట‌న‌లో ఎన్ కౌంట‌ర్ ఎపిసోడ్ పై తెలంగాణ పోలీస్.. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల నుంచి మెప్పు పొందిన సంగ‌తి తెలిసిందే. సెల‌బ్రిటీలు ముక్త‌కంఠంతో ఆ ఎన్ కౌంట‌ర్ ని స‌మ‌ర్థించారు. ఇక‌పై హ‌త్యాచారాలు జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఇలాంటి శాస్తి జ‌ర‌గాల్సిందే. దిశ‌కు ఇదే స‌రైన న్యాయం అంటూ అంద‌రూ ప్ర‌జాకోర్టులో జ‌డ్జిమెంట్ ఇచ్చేశారు. ఇక ఈ ప‌ని చేసిన పోలీసుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. జ‌రిగిన ఘ‌ట‌న‌పై మానవ హ‌క్కుల క‌మీష‌న్ (హెచ్.ఆర్.సి) సుమోటోగా ద‌ర్యాప్తు సాగిస్తుంటే హెచ్.ఆర్.సీ పైనా తీవ్ర విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు జ‌నం.
 
ఈ ఘటనపై భారత బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్ తాజాగా స్పందించారు. ``గ్రేట్ వర్క్.. హైదరాబాద్ పోలీస్.. మీకిదే నా శాల్యూట్`` అంటూ సైనా చేసిన ట్వీట్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. అయితే సైనాపై విమ‌ర్శ‌లు అదే స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ``నీ నుంచి ఇంత తెలివితక్కువ ట్వీట్ రావడం చూసి ఆశ్చర్యం క‌లుగుతోంది. ఈ ట్వీట్‌పై నీకు ప్రశంసలు వస్తాయి.కానీ నీ లాంటి ప్రముఖ వ్యక్తి మహిళలకు ఆదర్శవంతమైన వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేసే ముందు దాని వల్ల కలిగే నష్టం గురించి ఒకసారి ఆలోచించు. ఇంకోసారి ఇలాంటి కామెంట్ చేసే ముందు విష‌య ప‌రిజ్ఞానం పూర్తిగా తెలుసుకోండి`` అని విమ‌ర్శనాత్మ‌కంగా రీట్వీట్ ఎదురైంది.

అయితే దీనికి సైనా అంతే ధీటుగా స్పందిస్తూ .. రేపిస్టుల మ‌న‌స్థ‌త్వాన్ని చ‌ట్టాలు మార్చ‌లేవు.. ఆ స‌మ‌యంలో దిశ వ‌ద్ద తుపాకి ఉండి ఉంటే షూట్ చేసేది! అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో తాను ఎంత న‌ర‌కం అనుభ‌వించి ఉంటుందో ఊహించ‌లేక‌పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రేపిస్టుల‌ను కాల్చి చంప‌డం త‌న‌కు సంతోషం క‌లిగించింద‌ని.. ఇత‌రుల‌ అభిప్రాయాల‌తో త‌న‌కు ప‌ని లేద‌ని సైనా వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News