కొత్త పాటని కలపడం.. ఓటీటీలో వదలడం.. ఏంటో ఈ స్ట్రాటజీ..!

Update: 2022-06-03 03:56 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మూడు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. డివైడ్ టాక్ నెగెటివ్ రివ్యూలను బట్టి చూస్తే ఇన్ని రోజులు థియేటర్లలో ఉండటం.. 200 కోట్ల క్లబ్ లో చేరడం గొప్ప విషయమే. మహేశ్ స్టార్ పవర్ కి ఇది నిదర్శనం.

ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు విడుదల అవడంతో కొన్ని ప్రధాన కేంద్రాలు మినహాయిస్తే ఆల్మోస్ట్ 'సర్కారు వారి పాట' సినిమా ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసినట్లే. రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గానే నిలబడినా.. థర్డ్ వీక్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మేకర్స్ కూడా పబ్లిసిటీ జోరు తగ్గించేశారు.

అయితే ఉన్నట్టుండి గురువారం నుంచి కొత్తగా 'మురారి వా' అనే పాటను సర్కారు వారి సినిమాకు జత చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. 'మా మా మహేష్' పాట కోసం పక్కన పెట్టేసిన ఈ సాంగ్ ను మళ్లీ కలపడం వల్ల సినిమా లాంగ్ రన్ కు ఏమాత్రం ప్రయోజనం చేకూరినట్లుగా అనిపించడం లేదు.

కలెక్షన్లకు కాస్త ఊపు తీసుకొద్దామని భావిస్తే పోయిన వారంతలోనే 'మురారివా' పాటను యాడ్ చేసి ఉంటే ఫ్యాన్ రిపీట్ షోలు వేసేవాళ్ళు.. ఫలితం ఉండేది. కానీ ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తయ్యే టైంలో ఈ సాంగ్ ను జోడించడం వల్ల అద్భుతాలు జరిగే ఛాన్స్ అయితే లేదు.

సరే మరో పాటను కలిపారు కాబట్టి ఈ వీకెండ్ లో ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనుకుంటే.. ఇప్పుడు సైలెంట్ గా 'సర్కారు వారి పాట' ను ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచారు. థియేటర్లలో కొత్త పాటని జోడించడం.. అదే రోజు ఓటీటీలో సినిమాని రిలీజ్ చేయడం వెనుక మేకర్స్ స్ట్రాటజీ ఏంటనేది అభిమానులకు అంతుబట్టలేదు.

అమెరికా ప్రైమ్ వీడియోలో పే పర్ వ్యూ రెంటల్ విధానంలో SVP చిత్రాన్ని స్ట్రీమింగ్ పెట్టారు. 'కేజీఎఫ్ 2' తర్వాత ఈ విధంగా ఓటీటీలో రిలీజ్ అయిన పెద్ద హీరో సినిమా ఇదే. దీనికి ప్రత్యేకంగా పబ్లిసిటీ కూడా ఏమీ చేయకుండా సైలెంట్ గా వదలడం గమనార్హం. అయితే ఓటీటీలో రూ.199 పెట్టి ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని అనుకుంటే.. థియేటర్లో ఇప్పుడు సాంగ్ ని జత చేయడం అనవసరమనే అనుకోవాలి.

ఒకవేళ థియేటర్లలో ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోందని అనుకుంటే.. ఫైనల్ రన్ పూర్తవ్వకుండానే ఓటీటీలోకి తీసుకురావడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. ఇది మహేష్ ఫ్యాన్స్ ని సైతం నిరుత్సాహానికి గురి చేస్తోంది. కేవలం మూడు వారాల్లోనే డిజిటల్ రిలీజ్ చేసి సినిమాని చంపేస్తున్నారంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. మైత్రీ టీమ్ పై ఫైర్ అవుతున్నారు.

ఇటీవల కాలంలో 'రాధేశ్యామ్' 'ఆచార్య' వంటి ఒకటీ రెండు పెద్ద సినిమాలు మాత్రమే మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేశాయి. కాకపోతే అవి రెండూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినప్పటికీ మెగా తండ్రీకొడుకులు కలిసి చేసిన సినిమా నెల తిరక్కుండానే డిజిటల్ రిలీజ్ అయిందంటూ 'ఆచార్య' మీద సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరియు నందమూరి అభిమానులు కామెడీ చేశారు. అయితే ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమా కూడా మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.

దీనిపై యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. థియేటర్లలో ఇంకా బలంగా ఉందని అనుకుంటే అప్పుడే ఎందుకు డిజిటల్ రిలీజ్ చేస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదనంగా డబ్బులు చెల్లించాలనే విషయాన్ని మహేష్ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. సర్కారు వారి పాటకు మళ్ళీ డబ్బులు పెట్టి ఎంత మంది చూస్తారో.. 'మురారివా' పాట కోసం థియేటర్లకు వెళ్ళేవాళ్ళు ఎంతమందో మరి.
Tags:    

Similar News