కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తున్న 'చెప్పు దాడి'

Update: 2022-12-21 14:30 GMT
ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవ చినికి చినికి గాలి వానలా మారి ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఆ హీరోల్లో ఒకరు దివంగత పునీత్ రాజ్ కుమార్ కాగా.. మరొకరు అక్కడి టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్. ఇటీవల తన కొత్త సినిమా 'క్రాంతి' ప్రమోషన్లలో భాగంగా దర్శన్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.

తన అభిమానులు తనను ప్రేమించే విధానం గురించి అతను మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ చనిపోయాక ఆయన అభిమానులు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారో తన ఫ్యాన్స్ ఇప్పుడు అలాగే తనపై ప్రేమను వ్యక్తం చేస్తున్నారని దర్శన్ వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను పునీత్ ఫ్యాన్స్ నెగెటివ్‌గా తీసుకున్నారు. 'క్రాంతి' సినిమాకు సంబంధించిన వేడుకలో దీనిపై దర్శన్ అభిమానులతో గొడవ పడ్డారు. ఇరు వర్గాల అభిమానులు ఆ కార్యక్రమంలో కొట్టుకోవడం చర్చనీయాంశమైంది.

గొడవ అంతటితో ఆగకుండా.. క్రాంతి సినిమాకు సంబంధించిన తాజా ప్రమోషనల్ ఈవెంట్లో దర్శన్ మీదికి ఒక పునీత్ అభిమాని చెప్పు విసరే వరకు వచ్చింది. ఆ అభిమానిని దర్శన్ ఫ్యాన్స్ కొట్టబోతుంటే దర్శన్ వారించాడు. ఐతే శాండిల్ వుడ్ టాప్ స్టార్లలో ఒకడైన దర్శన్ మీద ఇలా ఓ అభిమాని చెప్పుతో దాడి చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యవహారం శ్రుతి మించుతుండడంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా దీనిపై స్పందించారు.

స్వయంగా పునీత్ సోదరుడైన శివరాజ్ కుమార్ ఈ ఘటనను ఖండించాడు. ఇండస్ట్రీలో తామందరం ఒక కుటుంబంలా ఉంటామని.. దర్శన్ మీద అలా దాడి చేయడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. కిచ్చా సుదీప్, యశ్ తదితర స్టార్లందరూ కూడా దర్శన్‌కు బాసటగా నిలిచారు. అభిమానుల తీరును ఖండించారు. వీళ్లెంతగా గొడవను సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పునీత్, దర్శన్ అభిమానుల మధ్య ఆఫ్ లైన్, ఆన్ లైన్ వార్ తగ్గట్లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News