డైల‌మాలో స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు..?

Update: 2022-11-16 13:30 GMT
టాలీవుడ్ లో ఒక్కో హీరోకు ఒక్కో కోట‌రీస్ వుండేవి. ఆ కోట‌రీకి చెందిన వారు మాత్ర‌మే ఒక హీరోతో  సినిమాలు నిర్మించేవారు. వారితో త‌ప్ప స్టార్ హీరోలు మ‌రో నిర్మాత‌కు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అయితే ఈ మ‌ధ్య అలాంటి కోట‌రీలు ఏవీ క‌నిపించ‌డం లేదు. స్టార్ హీరోతో సినిమా తీయాల‌ని ముందుకొచ్చే ప్ర‌తీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో అంద‌రు హీరోలు క‌లిసి సినిమాలు చేస్తున్నారిప్ప‌డు. అలా అంత‌రు హీరోలు క‌లిసి సినిమాలు చేస్తున్న టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌసెస్ ఇప్ప‌డు డైల‌మాలో ప‌డ్డాయా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

టాలీవుడ్ లో వున్న టాప్ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు మైత్రీ మూవీ మేక‌ర్స్‌..పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ.. ఈ రెండు ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేక‌ర్స్ మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ర‌కు వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తోంది.

చిరుతో వాల్తేరు వీర‌య్య‌, బాల‌కృష్ణ‌తో 'వీర సింహారెడ్డి, అల్లు అర్జున్ తో 'పుష్ప ది రూల్‌', విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'ఖుషీ', క‌ల్యాణ్ రామ్ తో 'అమిగోస్‌', ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్.. కిర‌ణ్‌ అబ్బ‌వ‌రంతో 'మీట‌ర్‌' వంటి సినిమాలు చేస్తోంది.

అయితే భారీ ప్రాజెక్ట్ కోసం కొంత మంది స్టార్ ల‌కు భారీ స్థాయిలో అడ్వాన్స్ లు ఇచ్చేసింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌' చేయాలనుకుంది. అంద‌రికి అడ్వాన్స్ లు కూడా ఇచ్చేసింది కానీ ఇది ఇంత వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డంతో ఇప్ప‌డు డైల‌మాలో ప‌డుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి రెండేళ్ల‌వుతున్నా ఎంత‌కీ ముందుకు క‌ద‌లక‌పోవ‌డంతో ప‌వ‌న్ కు ఇచ్చిన అడ్వాన్స్ ని రిట‌ర్న్ తీసుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ లో భారీ సినిమాల‌కు శ్రీ‌కారం చుట్టిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ఇప్ప‌టికే ప‌లు భారీ ప్రాజెక్ట్ లు నిర్మిస్తోంది. ర‌వితేజ తో 'ధ‌మాకా'తో పాటు ప్ర‌భాస్ - మారుతి కాంబినేష‌న్ లో అత్యంత భారీ స్థాయిలో హార‌ర్ థ్రిల్ల‌ర్ ని నిర్మిస్తోంది. దీనితో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ తో 'వినోదాయ సితం' రీమేక్ ని జీ స్టూడియోస్ తో క‌లిసి నిర్మించ‌డానికి ప్లాన్ చేసింది. స‌ముద్ర‌ఖ‌ని దీనికి డైరెక్ట్ చేయ‌నున్నాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ కీల‌క పాత్ర‌కు అనుకున్నారు.

ఈ మూవీ కూడా ఇంత వ‌ర‌కు ప‌ట్టాలెక్క‌డం లేదు. స‌ముద్ర‌ఖ‌ని ఈ ప్రాజెక్ట్ కోసం ఓపిక‌గా ఎదురుచూస్తున్నాడు. ప‌వ‌న్ ఏపీ రాజ‌కీయాల్లో బిజీగా వుండ‌టం వ‌ల్ల సినిమాల‌కు స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలా? .. వెన‌క్కి వెళ్లాలా? అనే డైల‌మాలో పీపుల్ మీడియా వారు వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్ పై ప‌వ‌న్ క్లారిటీ ఇస్తారా?  లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News