డిజాస్టర్ సెటిల్మెంట్ వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది..?

Update: 2022-09-16 08:30 GMT
సినిమా ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు సర్వసాధారణం. సక్సెస్ వస్తే సినిమాతో సంబంధం ఉన్న అన్ని పార్టీలు లాభాలు వెనకేసుకుంటారు.. ఫెయిల్యూర్స్ వస్తే నష్టాలు మూటగట్టుకుంటారు. డిజాస్టర్స్ పడితే భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడే కొందరు నిర్మాతలు నిబద్ధతతో డిస్ట్రిబ్యూటర్స్ కు ఎంతో కొంత నష్టాన్ని భర్తీ చేస్తుంటారు.. మరికొందరు మాత్రం మొహం చాటేస్తుంటారు.

ఇటీవల కాలంలో భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారిన సినిమాలలో 'లైగర్' ఒకటి.  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ మరియు ఛార్మీ కౌర్ ఈ సినిమాని నిర్మించారు.

పాన్ ఇండియా స్థాయిలో పోయిన నెలలో రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇప్పుడు దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ 'లైగర్' డిస్ట్రిబ్యూటర్లకు కొంతమేర నష్టాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

రిలీజ్ కు ముందు 'లైగర్' చుట్టూ నెలకొన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు అధిక రేట్లకే ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అయితే డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భారీ నష్టాలను చవిచూశారు. దీంతో పూరీ మరియు ఛార్మి వారికి పరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, పూరి జగన్నాథ్ గత కొన్ని రోజులుగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కు ఆన్‌ లైన్ లావాదేవీల ద్వారా సెటిల్ చేస్తున్నారట. రాబోయే రోజుల్లో ఇతర బయ్యర్లకు కూడా పరిహారం చెల్లించనున్నారని అంటున్నారు. పూరీ కి డబ్బు కంటే సినిమా ప్రధానం కాబట్టి.. తిరిగి కొంత మొత్తం ఇచ్చేస్తున్నాడని పేర్కొంటున్నారు. అయితే ఎంత శాతం నష్టాన్ని భర్తీ చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే 'లైగర్' ప్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సెట్స్ మీదకు తీసుకెళ్లిన 'జనగణమన' (JGM) సినిమాని పూర్తిగా పక్కన పెట్టేసారని అంటున్నారు. నిర్మాణ భాగస్వాములు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే దీనికి కారణమని చెబుతున్నారు.

ఇప్పటికైతే 'జనగణమన' ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. సైమా అవార్డ్స్ ఫంక్షన్ లో విజయ్ సైతం దీనిపై సమాధానం దాటవేశారు. ఒకవేళ ఈ  సినిమా ఆగిపోతే పూరీ తదుపరి సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి త్వరలోనే డాషింగ్ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News