మాస్ సినిమా కోసం మాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్..!

Update: 2022-07-18 11:30 GMT
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''లైగర్'' (సాలా క్రాస్‌ బ్రీడ్). బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

'లైగర్' నుండి ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ - ఫస్ట్ లుక్ - టీజర్ - రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో జూలై 21న థియేట్రికల్ ట్రైలర్‌ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. మాస్ సినిమా కాబట్టి మాస్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు.

'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ మరియు ముంబై నగరాలలో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో జూన్ 21న ఉదయం 9.30 గంటలకు.. అంధేరీలోని సినీ పోలిష్ లో సాయంత్రం 7.30 గంటలకు ఈ కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.

అంతేకాదు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముందు మార్కెటింగ్ గురించి 'లైగర్' టీమ్ డిస్కస్ చేస్తున్న ఓ వీడియోని కూడా షేర్ చేశారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ మరియు నిర్మాతలు కరణ్ జోహార్ - ఛార్మీ కౌర్ ఉన్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను సౌత్ మరియు నార్త్ రెండు చోట్లా జరుపుదామని.. ఇది సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు.

కాగా, 'లైగర్' చిత్రంలో విజయ్ ఒక MMA బాక్సర్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించగా.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకూ బయటకు వచ్చిన కంటెంట్ లో రాబోయే ట్రైలర్ లో వీరందరూ భాగం కానున్నారు.

పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై 'లైగర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహర్ - అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News