ఖుషికి ముందే ఓ 'ఆట' ఆడేయబోతున్న రౌడీ స్టార్‌

Update: 2022-12-26 06:44 GMT
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. అర్జున్‌ రెడ్డి.. గీతా గోవిందం సినిమాల తర్వాత ఆ స్థాయి సక్సెస్ ను విజయ్ ఇప్పటి వరకు దక్కించుకోలేదు. అయినా కూడా ఆయన క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. లైగర్ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న విజయ్‌ దేవరకొండ ఆ సినిమా ఫెయిల్‌ అవ్వడంతో తదుపరి సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్న విషయం తెల్సిందే. సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయ్యింది. కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల సినిమా చిత్రీకరణ నిలిచి పోయింది. సమంత షూటింగ్‌ లో జాయిన్ అయితే కానీ ఖుషి సినిమాకు గుమ్మడి కాయ కొట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే పరిస్థితి లేదు.

ఖుషి సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ తదుపరి సినిమాను మొదలు పెట్టాలి అనుకున్నాడు. కానీ ఖుషి సినిమా ఎప్పటికీ తిరిగి ప్రారంభం అవుతుందో క్లారిటీ లేదు. అందుకే ఈ గ్యాప్ లో గౌతమ్ తిన్ననూరి సినిమాను మొదలు పెట్టేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం క్రీడా నేపథ్యంలో విజయ్ దేవరకొండ తో దర్శకుడు గౌతమ్‌ సినిమాను చేయబోతున్నాడట. సీతార వారు మై హోమ్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ ఆటల నేపథ్యంలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.

సమంత అనారోగ్యంతో మరిన్ని రోజులు ఇంటికే పరిమితం అయితే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కంటే ముందే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోతున్న స్పోర్ట్స్ నేపథ్యంలోని సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. నానితో జెర్సీ సినిమాను చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ఈసారి రౌడీ స్టార్ తో ఆట ఆడించి సక్సెస్ దక్కించుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News