‘మెర్శల్’ వివాదంలో కొత్త మలుపు

Update: 2017-10-23 07:17 GMT
దీపావళి కానుకగా విడుదలైన తమిళ సినిమా ‘మెర్శల్’ ఎలా ఉందన్న దాని కంటే కూడా అందులోని కొన్ని డైలాగుల గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఆ చిత్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు.. వైద్యులు.. జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ పేల్చిన డైలాగులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ మీద విజయ్ సెటైర్లు వేయడం భారతీయ జనతా పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. ఆ డైలాగులు తొలగించేందుకు ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఐతే దీనిపై జనాల మద్దతు ‘మెర్శల్’కే కనిపిస్తుండటం.. తాము సంధించిన అస్త్రం బూమరాంగ్ కావడంతో తమిళనాడు భాజపా నేతలు ఆలోచనలో పడ్డారు.

వివాదాన్ని దారి మళ్లించడానికి కొత్త అస్త్రం మీద దృష్టిపెట్టారు. విజయ్ మతం మీదికి ఫోకస్ మళ్లించారు. సినిమాలో ఒకచోట విజయ్.. జనాలకు కావాల్సింది దేవాలయాలు కాదని ఆసుపత్రులని అంటాడు. ఈ డైలాగ్ వెనుక ఉద్దేశం వేరని భాజపా నేతలు అంటున్నారు. విజయ్ క్రిస్టియన్ అని.. అందుకే దేవాలయాల నిర్మాణాన్ని తప్పుబడుతూ ఈ డైలాగ్ పేల్చాడని.. ఇది హిందూ మతం మీద దాడే అని వాళ్లు సూత్రీకరిస్తున్నారు. విజయ్ అయినా.. ఇంకొకరైనా భారీగా పెరుగుతున్న చర్చిల గురించి.. మత మార్పిడుల గురించి మాట్లాడరని.. మసీదుల ఊసు కూడా ఎత్తరని.. కానీ దేవాలయాల నిర్మాణం మీద మాత్రం సెటైర్లు పేల్చుతారని వారంటున్నారు. గత దశాబ్ద కాలంలో దేశంలో దేవాలయాల కంటే కూడా చర్చిలు.. మసీదుల నిర్మాణమే ఎక్కువ జరిగిందని వారు వాదిస్తున్నారు. మరి విజయ్ వైపు నుంచి ఈ విషయంలో ఏమైనా వివరణ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News