దాసన్న జోష్ అలా ఉంది..

Update: 2019-05-29 06:54 GMT
ఈ నెల 31 వ తారీఖున అంటే శుక్రవారం నాడు మూడు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ వాటిలో క్రేజీ ఫిలిం మాత్రం 'ఫలక్ నుమా దాస్'.  విష్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో హీరోగా నటించిన 'ఫలక్ నుమా దాస్' ఇప్పటికే ప్రోమోస్ తో సంచలనం సృష్టించింది.  సినిమాలోని బోల్డ్ కంటెంట్ ఒకవైపు యూత్ ఆడియన్స్ ను మెప్పిస్తే మరో వైపు అదే కంటెంట్ కొందరి విమర్శలకు కారణం అయింది.

ఇదిలా ఉంటే 'ఫలక్  నుమా దాస్' మరో విషయంలో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది. ఈమధ్య కాలంలో పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా విడుదల కు ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేయడం లేదు.  నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయితే ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ప్రభావం పడుతూ ఉండడంతో పెద్ద సినిమాల మేకర్లు ముందు రోజు ప్రీమియర్లకు దూరంగా ఉంటున్నారు.  సినిమాపై కాన్ఫిడెంట్ ఉంటే తప్ప ప్రీమియర్ల జోలికి పోవడం లేదు.  ఈమధ్య కాలంలో అలా పెయిడ్ ప్రీమియర్లు వేసిన చిత్రాలు 'అర్జున్ రెడ్డి'.. 'బాహుబలి 2' మాత్రమే.  లక్కీగా ఆ సినిమాలకు ప్రీమియర్లు ప్లస్ అయ్యాయి. సినిమాలు ఘన విజయం సాధించాయి.

ఇప్పుడు 'ఫలక్ నుమా దాస్' కు 30 తారీఖు రాత్రి పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. వీటికి రెస్పాన్స్ భారీగా ఉంది.  ఈ ప్రీమియర్ల టికెట్లు  జోరుగా అమ్ముడవుతున్నాయి. ఒకవేళ సినిమా కనుక అంచనాలను అందుకోగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రీమియర్ల విషయంలో 'ఫలక్ నుమా దాస్'.. 'అర్జున్ రెడ్డి'.. 'బాహుబలి' సరసన చేరినట్టే.


Tags:    

Similar News