'18 పేజెస్' కంటే ముందు 'కార్తికేయ 2' వస్తుందా..?

Update: 2022-04-14 16:30 GMT
చాలా కాలంగా బిగ్ స్క్రీన్ మీద కనిపించని టాలీవుడ్ హీరోలలో నిఖిల్ సిద్దార్థ్ ఒకరు. చివరిగా 'అర్జున్ సురవరం' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో.. ఆ తర్వాత వెంటనే మరో సినిమాని ప్రేక్షకులకు అందించలేకపోయాడు.

నిఖిల్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నప్పటికీ.. కరోనా పాండమిక్ పరిస్థితుల కారణంగా షూటింగ్స్ డీలే కావడంతో విడుదలకు నోచుకోలేదు. అయితే ఇప్పుడు అందులో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. కాకపోతే ఏ మూవీ ఎప్పుడు వస్తుందో స్పష్టత రావడం లేదు.

'కుమారి 21 ఎఫ్‌' ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో నిఖిల్‌ - అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంటగా నటించిన చిత్రం ''18 పేజెస్''. సుకుమార్‌ దీనికి కథ - స్క్రీన్‌ ప్లే అందించడమే కాదు.. నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. అల్లు అరవింద్‌ ఈ సినిమాకు సమర్పకులు.

జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు '18 పేజెస్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇటీవల వదిలిన వీడియో గ్లిమ్స్ లో మాత్రం సమ్మర్ రిలీజ్ అని ప్రస్తావించారు.

మరోవైపు సిద్దార్థ్ - అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ''కార్తికేయ 2'' సినిమా విడుదల తేదీని లాక్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ను 2022 జూలై 22న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు వదలకుండానే అప్పుడే ''కార్తికేయ 2'' రిలీజ్ డేట్ ఇచ్చారు.

కానీ అప్పుడెప్పుడో రిలీజ్ చేస్తారనుకున్న '18 పేజెస్' ఎప్పుడు విడుదల చేస్తారో అనౌన్స్ చేయడం లేదు. ఈ వేసవిలో తేదీని లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ.. దాని మీద ఎటువంటి గ్యారెంటీ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో '18 పేజెస్' కంటే ముందు 'కార్తికేయ 2' రిలీజ్ అవుతుందేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News