'యశోద' కలెక్షన్స్: ట్రెండ్ చూస్తుంటే డిజాస్టర్ అయ్యేలా ఉందే..!

Update: 2022-11-17 08:30 GMT
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "యశోద". గత శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదలైంది. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

'యశోద' సినిమా తొలి రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఎలాంటి కాంపిటేషన్ లేకుండా సమంత సినిమా రిలీజ్ అయింది. మంచి వసూళ్లు వస్తాయని అందరూ భావించారు. కానీ సామ్ స్టార్ పవర్ ఏమాత్రం పని చెయ్యలేదని ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బట్టి తెలుస్తోంది.

నిజానికి ఇటీవల కాలంలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడంలో విఫలం అవుతున్నాయి. దసరా - దీపావళి సందర్భంగా వచ్చిన ఏ ఒక్క తెలుగు చిత్రం కూడా 'హిట్' అనిపించుకోలేదు. అయితే 'కాంతారా' లాంటి డబ్బింగ్ సినిమా మాత్రం తెలుగులో 50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ నేపథ్యంలో సమంత నటించిన 'యశోద' రిలీజ్ అవడంతో.. ఈ సినిమా 'కాంతారా' వసూళ్లను బీట్ చేస్తుందని అందరూ ఆశించారు. కానీ తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. మొదటి వారం నాటికి పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. రెండో వారంలో ఇంతకంటే గొప్పగా ఏం ఆశించలేం.

దీన్ని బట్టి సామ్ సినిమా 'కాంతారా' ని బీట్ చేయడం కాదు కదా.. దరిదాపుల్లోకి చేరుకునే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'యశోద' కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే డిజాస్టర్ అనే చెప్పొచ్చు. 40 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన నిర్మాతకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా నష్టాలే మిగిలేలా ఉన్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులు మాత్రమే నిర్మాతను గట్టెక్కించాలి.

సరోగసీ నేపథ్యంలో మెడికల్ మాఫియా ప్రధానంగా ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ గా యశోద సినిమాని తెరకెక్కించారు. తమిళ దర్శక ద్వయం హరి & హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ - ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సుకుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అశోక్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు.

ఏదేమైనా 'యశోద' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్న సమంత కు నిరాశే ఎదురైందని చెప్పాలి. త్వరలోనే సామ్ 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రంతో పాన్ ఇండియాని టార్గెట్ చేయబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు మరియు నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News