బాలయ్య, విశ్వక్ బాటలో బెల్లంకొండ?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 12వ సినిమాతో లుధీర్‌ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది

Update: 2024-07-12 06:20 GMT

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్లాన్స్ బెడిసికొట్టడంతో ఇప్పుడు పూర్తిగా టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. ముందుగా 'టైసన్ నాయుడు' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉండగానే ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి 'BSS 11' సినిమాకి దర్శకుడు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 12వ సినిమాతో లుధీర్‌ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చడంతో గత రెండేళ్లుగా టీమ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్న యంగ్ హీరో.. ఈ ఏడాదే ఈ సినిమాని పట్టాలెక్కించాలని భావిస్తున్నారట. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కే సినిమా కానుంది. చందు మహేష్, సాయి శశాంక్ దీనికి నిర్మాతలు. ఈ చిత్రానికి ''హైందవ'' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో శ్రీనివాస్ ఒక అఘోరా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

సాయి శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోడానికి వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారని అర్థమవుతోంది. 'టైసన్ నాయుడు'లో పోలీసాఫీసర్ గా, మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ రోల్ లో కనిపించబోతున్నారు. అలానే షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో కౌశిక్ తో చేస్తున్న సినిమా ఒక హారర్ మిస్టరీ. ఇందులో అతని క్యారక్టర్ కొత్తగా ఉండబోతోంది. ఈ క్రమంలో 'BSS 12' చిత్రంలో అఘోరా పాత్రలో నటించే సాహసం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇంతకముందు 'అఖండ' సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోరా గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. త్వరలో 'అఖండ 2' తో మరోసారి అఘోరాగా తిరిగి రాబోతున్నారు. అలానే యువ హీరో విశ్వక్ సేన్ సైతం 'గామి' మూవీలో అఘోర పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇలా మన హీరోలు అలాంటి వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. మరి ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా అఘోరా క్యారక్టర్ తో అలరిస్తారేమో చూడాలి.

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకుగా, 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సాయి శ్రీనివాస్. కెరీర్ ప్రారంభం నుంచీ మాస్ మసాలా సినిమాలతో ఆడియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే చివరగా ఆయన్నుంచి వచ్చిన 'అల్లుడు అదుర్స్' చిత్రం నిరాశ పరిచింది. ఇదే క్రమంలో హిందీలో చేసిన 'ఛత్రపతి' రీమేక్ డిజాస్టర్ గా మారింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో వస్తున్నారు. యువ హీరో ఈ మూడు సినిమాలను ఒకేసారి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

Tags:    

Similar News