ధూమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫీస్లో 40లక్షల దొంగతనం
అయితే ఆయన బృందంలోని ఒక ప్రముఖ సభ్యుడు ఈ దొంగతనానికి కారకుడు అయి ఉండొచ్చని ఊహాగానాలున్నాయి.
బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీలో పలు చార్ట్ బస్టర్ సాంగ్స్ కి స్వరాల్ని సమకూర్చిన ప్రీతమ్ దోపిడీకి గురయ్యారు. సంగీత దర్శకుడు, `ధూమ్` మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి ముంబై కార్యాలయంలో దొంగతనం జరిగింది. సుమారు రూ.40 లక్షల నగదు దొంగిలించిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రీతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రీతమ్ ఇంకా ఈ సంఘటనపై బహిరంగంగా వ్యాఖ్యానించలేదు. అయితే ఆయన బృందంలోని ఒక ప్రముఖ సభ్యుడు ఈ దొంగతనానికి కారకుడు అయి ఉండొచ్చని ఊహాగానాలున్నాయి. ప్రస్తుతం అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలో బయటపడనున్నాయి. బాలీవుడ్లో బ్లాక్బస్టర్ చిత్రాలకు పాటలు అందించిన ప్రముఖుడిగా ప్రీతమ్ కి గొప్ప గుర్తింపు ఉంది. ఆయన నమ్మిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడ్డారా? అన్నది పోలీసులు ఆరాలు తీస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్ ఆర్టిస్టుల దారి దోపిడీ వ్యవహారం సహా స్టార్లకు గ్యాంగ్ స్టర్ బెదిరింపులు వగైరా సంచలనంగా మారుతున్నాయి. అలాగే కొందరు ప్రముఖులు సైబర్ నేరగాళ్ల భారిన పడి, మోసగాళ్ల వలకు చిక్కి తమ డబ్బును కోల్పుతున్న ఘటనలు బయటపడుతున్నాయి.
స్వగతం ఇదీ:
ప్రీతమ్ చక్రవర్తి ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన 2001లో హిందీ సినిమా తేరే లియేలో సహయ సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి `ధూమ్` సినిమాతో ఆయన సోలో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.
ప్రీతమ్ రెండు దశాబ్దాలకుపైగా తన కెరీర్లో 125 కి పైగా సినిమాలకు సంగీతం అందించి అనేక అవార్డులను అందుకున్నాడు. వాటిలో ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు, నాలుగు మిర్చి మ్యూజిక్ అవార్డులు ఉన్నాయి.