ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిథిగా మెగా హీరో..

2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించాయి.

Update: 2024-06-11 03:44 GMT

2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించాయి. వైఎస్సారీసీపిని దారుణంగా ఓడించి 164 స్థానాలు కైవసం చేసుకుని కూటమి విజయ ఢంకా మోగించింది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 12, బుధవారం నాడు ఉదయం 11 గంటలా 27 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది.

సుమారు 11 ఎకరాల స్థలంలో బాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం తర్వాత ఆంధ్రాలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ జనసేన. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవానికి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

చరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలకు ముందు మొత్తం మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. రామ్ చరణ్ స్వయంగా పిఠాపురం చేరుకొని బాబాయికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. పవన్ విజయాన్ని మొత్తం మెగా ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి కష్టపడి పని చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం మహోత్సవానికి హాజరు కావలసిందిగా రామ్ చరణ్ కు ప్రభుత్వం తరఫున అఫీషియల్ ఆహ్వానం కూడా అందినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్, చంద్రబాబు కలిసి ఉన్న ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. మెగా ఫాన్స్ తో పాటు పవర్ స్టార్ ఫాన్స్ కూడా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. చిత్రాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయి తర్వాత రామ్ చరణ్ జాన్వీ కపూర్ తో మరొక చిత్రం చేయనున్నారు.

Tags:    

Similar News