'జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్ ఆశ‌లు

ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ నోటి నుంచి వ‌చ్చిన కొన్ని వ్యాఖ్య‌ల‌తో అభిమానుల్లో గూస్ బంప్స్ క‌నిపిస్తున్నాయి.

Update: 2024-03-20 12:40 GMT

అవును.. 1990 క్లాసిక్ హిట్ `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ ఆశ‌లు ఇంకా స‌జీవంగానే ఉన్నాయి. చాలా కాలంగా నాటి మేటి క్లాసిక్ కి సీక్వెల్ రావాల‌ని మెగాభిమానుల‌తో పాటు, ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. ఇప్ప‌టికే దీనిపై ప్ర‌య‌త్నాలు సాగినా కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ వీలుప‌డ‌లేదు. మెగాస్టార్ చిరంజీవి-శ్రీ‌దేవి జంట‌గా కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ మాతృక సినిమాని నిర్మించారు. ఆయ‌నే సీక్వెల్ పైనా క‌స‌ర‌త్తు చేసారు. అనౌన్స్ మెంట్ కూడా చేసారు. కానీ ఈ సీక్వెల్ ఇప్ప‌టివ‌ర‌కూ ప్రారంభం కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశ‌ప‌డ్డారు.

ఇలాంటి స‌మ‌యంలో ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ నోటి నుంచి వ‌చ్చిన కొన్ని వ్యాఖ్య‌ల‌తో అభిమానుల్లో గూస్ బంప్స్ క‌నిపిస్తున్నాయి. నేడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ - జాన్వీ క‌పూర్ నాయ‌కానాయిక‌లుగా రూపొంద‌నున్న కొత్త సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్స‌వంలో జాన్వీ క‌పూర్ చీర క‌ట్టులో మామ్ శ్రీ‌దేవిని గుర్తు చేసింది. ఈ వేడుక‌లో ఆస్కార్ గ్ర‌హీత‌, సంగీత దిగ్గ‌జం ఏ.ఆర్.రెహ‌మాన్ కూడా పాల్గొన‌డం ఆస‌క్తిని క‌లిగించింది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన‌డంతో వేదిక‌కు కొత్త క‌ళ వ‌చ్చింది.

ఇలాంటి వేదిక‌పై రామ్ చ‌ర‌ణ్ త‌న క‌థానాయిక జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌స్థావిస్తూ.. ఎప్ప‌టి నుంచో చాలా మందికి సుదీర్ఘ క‌ల‌ నేను, జాన్వీ క‌పూర్ క‌లిసి సినిమా చేయాల‌ని.. `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్ చేయాల‌ని కోరుకుంటున్నారు. నా శ్రేయోభిలాషులు, స్నేహితులు, మా కుటుంబం ఎప్ప‌టి నుంచో ఆశ‌ప‌డుతున్నారు. ఆ అవ‌కాశం ఈ సినిమా ద్వారా రావ‌డం ఆనందాన్నిచ్చింది... అని అన్నారు. ``చాలా మంది చాలా కాలంగా ఆశ‌ప‌డుతున్నారు..`` అంటూ రామ్ చ‌ర‌ణ్ స్పీచ్ లో నొక్కి చెప్ప‌డంతో మ‌ళ్లీ ఉత్కంఠ మొద‌లైంది.

భ‌విష్య‌త్ లో చ‌ర‌ణ్ - జాన్వీ జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ చేస్తారా? అంటూ మ‌రోసారి ఫ్యాన్స్ లో చ‌ర్చ మొద‌లైంది. ఈ జోడీ అలాంటి ఒక క్లాసిక్ సినిమా సీక్వెల్లో న‌టించాల‌ని అంతా ఆశ‌ప‌డుతున్నారు. కానీ దానికి ఎప్ప‌టికి పునాది ప‌డుతుందో వేచి చూడాలి. మాతృక‌లో చిరంజీవి- శ్రీ‌దేవి జంట అద్భుత న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసారు. ఆ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌తో చ‌ర‌ణ్ - జాన్వీ మెప్పించాలంటే దానిని బిగ్‌ ఛాలెంజ్ గా స్వీక‌రించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News