స‌మంత‌కు భూటాన్‌లో ప్ర‌త్యేక వైద్య‌ చికిత్స‌?

నాకు మంచి రోజులు .. చెడు రోజులు ఉన్నాయి... శారీరకంగా మానసికంగా... మేనేజ్ చేయ‌గ‌ల‌న‌ని అనుకుంటున్నాను.. అని అప్ప‌ట్లో సామ్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

Update: 2023-11-07 08:16 GMT

సమంత రూత్ ప్రభు ఈ సంవత్సరం ప్రారంభంలో మైయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.ఈ ఆటో-ఇమ్యూన్ డిజార్డర్‌ను నయం చేయడానికి ఆయుర్వేదాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. దీనికోసం స‌మంత ఏడాది ఆరంభంలోనే హైదరాబాద్‌లో సాంప్రదాయ ఆయుర్వేద నిపుణులను సంప్రదించార‌ని, పునరుజ్జీవనం రోగనిరోధక శక్తిని పెంచే చికిత్స చేయించుకుందని కూడా క‌థ‌నాలొచ్చాయి.

ఆ త‌ర్వాత సమంత ఆసుపత్రిలో చేరిందనే వార్త కూడా ప్ర‌చార‌మైంది. అయితే స‌మంత ఇటీవ‌ల కొన్ని నెల‌ల పాటు అమెరికాలో మ‌యోసైటిస్ కోసం చికిత్స చేయించుకుంద‌ని వార్త‌లొచ్చాయి.

ఈ దుర్బలత్వాన్ని అంగీకరించడం నేను ఇంకా కష్టపడుతున్నాను. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వసిస్తున్నారు. నాకు మంచి రోజులు .. చెడు రోజులు ఉన్నాయి... శారీరకంగా మానసికంగా... మేనేజ్ చేయ‌గ‌ల‌న‌ని అనుకుంటున్నాను.. అని అప్ప‌ట్లో సామ్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఆ త‌ర్వాత ఓసారి సమంత రూత్ ప్రభు తన సోషల్ మీడియా ద్వారా తన వీడియోను పంచుకున్నారు. అందులోక్రయోథెరపీ అనే పాపుల‌ర్ వెల్‌నెస్ చికిత్స‌కు సంబంధించిన విష‌యాల్ని రివీల్ చేసారు. ఆ వీడియోలో టబ్ లాంటి కంటైనర్‌లో స్నానం చేస్తూ క‌నిపించింది. మ‌యోసైటిస్ నుంచి కోలుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి క్రియోథెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత తెలిపింది. క్రియోథెరపీ అనేది శరీరంలోని అసాధారణ కణజాలాలను నాశనం చేయడానికి, ఆరోగ్య సంరక్షణ ప్రదాత దగ్గరి గడ్డకట్టే ఉష్ణోగ్రతలను నిర్వహించే ప్రక్రియ.

ఇటీవ‌ల స‌మంత న‌ట‌నా కెరీర్ ని పున‌రుద్ధ‌రించారు. దీనికి కార‌ణం మ‌యోసైటిస్ నుంచి వేగంగానే కోలుకున్నారని భావించాలి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి ఇప్ప‌టికే విడుద‌లైంది. త‌దుప‌రి సిటాడెల్ ఇండియా వెర్ష‌న్ లోను స‌మంత న‌టించారు. ఇంత‌లోనే ఇప్పుడు మ‌రోసారి స‌మంత మ‌యోసైటిస్ చికిత్స కోసం ఆయుర్వేదాన్ని ఆశ్ర‌యించార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

స‌మంత ఇటీవ‌ల భూటాన్ వెళ్లారు. అక్క‌డ ఆయుర్వేద చికిత్స‌ను కొన‌సాగిస్తున్నారు. తాను తీసుకుంటున్న ఈ చికిత్స గురించి సమంత ఏదీ దాచ‌లేదు. డాట్‌షో (హాట్ స్టోన్ బాత్) అంటూ తన చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్ల‌డించారు. స‌మంత సోష‌ల్ మీడియా షేర్ చేసిన ఓ ఇమ‌జ్ లో ఇలా రాసి ఉంది. ``1000 ఏళ్ల‌ క్రితం భూటాన్ - ఇండియా మధ్య సత్సంబంధాలుండేవి.. ఇరు దేశాల మధ్య రాకపోకలు, ఆచారసంప్రదాయలు, విజ్ఞానాన్ని భాగ‌స్వామ్యం చేసుకుంటూ ఉండేవాళ్లం. ఆ స‌మ‌యంలోనే ఆయుర్వేదంలోని గొప్పదనాన్ని ఇరు దేశాలు షేర్ చేసుకునేవి. టిబెట్‌లో ఈ హాట్ స్టోన్ బాత్ ప్రసిద్దిచెందింది.. ఇండియన్ ఆయుర్వేదం నుంచి ఈ పద్దతిని వీరు కనుగొన్నారు.. ఈ హాట్ టబ్‌లో ఆ స్టోన్స్ కరిగి వాటిలో ఉన్న శక్తిని వదిలేస్తాయి. అది కేవలం ఈ హాట్ టబ్‌లోనే జరుగుతుంది. ఈ పద్దతిని డాట్‌షో అంటారు. ఇందులో వాడే మూలికలను కెంపా అంటారు. అవి మన కండరాలను ఉత్తేజ పరుస్తాయి. ఈ బాత్ టబ్బులోనే ఆ ఆకుల్ని కూడా వేయాలి. ఐదారు గంటలు వేడి చేస్తే అందులోని శక్తి అంతా బయటకు వస్తుంది.. నీటిలోకలుస్తుంది.. ఇవి రెండూ కలిసి మనలో ఉన్న నొప్పి, బాడీ పెయిన్స్, అలసటను తొలిగిస్తాయి. కడుపు నొప్పి.. ఎముకల బలహీనత.. జాయింట్ పెయిన్స్ ఇలా అన్నింటిని మాయం చేస్తుంది`` అంటూ చికిత్స గురించి వెల్ల‌డించారు. స‌మంత త‌దుప‌రి షూటింగ్ లో జాయిన్ అయ్యేదెపుడో ఇంకా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.

Tags:    

Similar News