ఏపీ వార్షిక బడ్జెట్ లో కీలక కేటాయింపులు ఇవే.. మంత్రి షాకింగ్ కామెంట్స్!
2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం.. శాసనసభలో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ క్యాబినెట్ ఆమొదం తెలిపింది. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరగగా.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలు అందజేశారు. అనంతరం.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో.. బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
అవును... 2025-26 వార్షిక బడ్జెట్ కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం.. శాసనసభలో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా... రూ.3.22 లక్షల కోట్లతో ఆయన ఈ బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా... బడ్జెట్ లో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు.
ఇదే సమయంలో... అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.6,705 కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలయ్యేలా తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు కేటాయించడం గమనార్హం. అదేవిధంగా.. ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమానికి భారీగానే కేటాయింపులు చేశారు!
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి పయ్యవుల కేశవ్... రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని.. అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్త్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఏపీకి అమరావతిని ప్రజా రాజధానిగా చేసుకున్నామని.. ప్రజల ఆకాంక్షల మేరకు అక్కడ పనులు పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయని.. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ముఖ్యంగా రూపాయి అప్పు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడిందని.. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ కూడా స్పష్టం చేసిందన్నారు. ఒకవైపు అప్పటి కే గుట్టలుగా పేరుకుపోయిన అప్పులు.. మరోవై పు.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం. ఇలాంటి సమయంలో కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. అత్యంత విపత్కర పరిస్థితిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చంద్రబాబు.. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై అంతర్మథనం చెందారన్నారు.
అయితే.. అమెరికా వేసిన అణుబాంబుల ధాటికి మసైపోయిన హరోషిమా లేచి నిలబడినట్టుగా.. ఏపీని నిలబెట్టాలని హిరోషిమాను స్ఫూర్తిగా తీసుకుని పనిచేసినట్టు మంత్రి వివరించారు తాజాగా ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను మంత్రి ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయా పద్దులను వివరిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. పంచాయతీల అధికారాలను కేంద్రీకృతం చేసి.. పంచాయతీ సర్పంచులను బిచ్చగాళ్లుగా మార్చిందని దుయ్యబట్టారు.
గత ప్రభుత్వం ప్రశాంతతను దూరం చేసి.. ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టిందన్న మంత్రి పయ్యావుల.. తాము రాగానే శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పోలీసు వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నా రు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు `బ్రాండ్ ఏపీ` నినాదంతో పెట్టుబడులను దూసుకువచ్చే ప్రయత్నంలో సఫలమైనట్టు తెలిపారు. ఇప్పటికే అనేక కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని, భవిష్యత్తులోనూ అనేక కంపెనీలు రానున్నాయని వివరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థల డ్రాపౌట్లు పెరిగిపోయాయని.. అదేసమయంలో వైసీపీ హయాంలో పారిశ్రామిక వేత్తలువెళ్లిపోవడంతో పారిశ్రామిక డ్రాపౌట్లు కూడా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఇప్పుడు సభకు డ్రాపౌట్ ద్వారా.. వైసీపీ తర్వలోనే ప్రజా జీవితం నుంచికూడా డ్రాపౌట్ అయ్యే రోజు త్వరలోనే ఉందని పయ్యావుల వ్యాఖ్యానించారు. చెత్తపన్ను రద్దు చేయడంతోపాటు.. పంచాయతీలకు ఏప్రిల్ 1 నుంచిసంపూర్ణ అధికారాలు ఇవ్వనున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా... ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో మహారాష్ట్రకు ముంబై, తెలంగాణకు హైదరాబాద్ నగరాల మదిరిగా, వాటికి సరితూగేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు.
బడ్జెట్ లో కీలక కేటాయింపులు ఇవే!:
* రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య భీమా అమలులోకి. ఈ క్రమంలో.. ఆరోగ్య శాఖకు రూ.19,264 కోట్ల కేటాయింపు.
* ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్. ఇదే సమయంలో.. చేనేత మగ్గాలపై ఆధారపడేవారికి 200 యూనిట్ల మేర, మరమగ్గాలపై ఆధారపడేవారికి 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించనున్నారు.
* ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్ లో గ్రీన్ సిగ్నల్. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ.75 వేలు ఇవ్వనున్నారు!
* చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
* వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు
* పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు
* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
* జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
* గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
* ఆర్ అండ్ బీ కి రూ.8,785 కోట్లు
* ఇంధన శాఖ రూ.13,600 కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
* స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణకు రూ.1,228 కోట్లు
* పాఠశాల విద్యాశాఖ రూ.31,805 కోట్లు
* ఉన్నత విద్యాశాఖకు రూ.2,506 కోట్లు
* ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
* ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
* బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
* అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
* మహిళా శిశు సంక్షేమం రూ.4,332 కోట్లు
* యువజన, పర్యాటకం రూ.469 కోట్లు
* గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
* తెలుగు భాష అభివృద్ధి కోసం రూ.10 కోట్లు
* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్ళు
* జల జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు
* పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
* డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
* తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
* దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
* మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
* స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు