మూడో యుద్ధం..మూడో ప్రపంచ యుద్ధం..ఉ.కొరియా సైన్యంలోకి 14 లక్షల మంది

చెత్త బెలూన్లు.. డ్రోన్లతో కరపత్రాలు.. సరిహద్దుల ధ్వంసం.. సైనిక విన్యాసాలు.. ఇలా అనేక పరిణామాల మధ్య ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య వాతావరణం ఉద్రిక్తతంగా మారింది.

Update: 2024-10-16 07:37 GMT

చెత్త బెలూన్లు.. డ్రోన్లతో కరపత్రాలు.. సరిహద్దుల ధ్వంసం.. సైనిక విన్యాసాలు.. ఇలా అనేక పరిణామాల మధ్య ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య వాతావరణం ఉద్రిక్తతంగా మారింది. చూస్తూ చూస్తూ ఉంటే ఇది ఎక్కడకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి. తాజాగా ఉత్తర కొరియా తీసుకున్న నిర్ణయం చూస్తే ఏదో జరగబోతోందనే ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో సతమతం అవుతున్న ప్రపంచానికి మూడో యుద్ధం ముప్పు కూడా పొంచి ఉందనే భయం కనిపిస్తోంది. వారంలో 14 లక్షలు.. రెండు రోజుల్లోనే 190 లక్షల మంది యువకులు ఉత్తర కొరియా ఆర్మీలో చేరడం గగ్గోలు పుట్టిస్తోంది.

చినికి చినికి కొరియా యుద్ధం..

కొరియా ద్వీప కల్పంలోని ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఎప్పుడూ ఉప్పు-నిప్పే.. రష్యా మద్దతుతో ఉత్తర కొరియా, అమెరికా అండాదండ ఉండే దక్షిణ కొరియా. దీన్నిబట్టే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అలాంటి కొరియాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దాయాదితో సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను రెండు రోజుల కిందట ఉత్తర కొరియా ధ్వంసం చేసేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ రాజధాని ప్యాంగ్ యాంగ్ పైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా మండిపడుతోంది. వీటిలో లేఖలు ఉన్నాయని చెబుతోంది. అంటే.. తమ ప్రభుత్వంపై ఉత్తర కొరియా కుట్ర చేస్తోందనేది దాని ఆరోపణ.

సైన్యాన్ని నింపేస్తోంది..

నియతం కిమ్ పాలనలో ఉత్తరకొరియాలో అనుకున్నది జరగాల్సిందే. దీంతో వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరారు. దీంతో రెండు దేశాల మధ్య దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర కొరియాలో కొత్తగా సైన్యంలో చేరినవారిలో లక్షలాది మంది విద్యార్థులు, యూత్‌ లీగ్‌ అధికారులు ఉన్నారు. కాగా, నిర్బంధ సర్వీసు పూర్తిచేసుకుని వచ్చినవారూ తిరిగి సైన్యంలో చేరారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియానే వెల్లడించింది. ‘‘యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారు. విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారు’’ అని పేర్కొనడాన్ని బట్టి చూస్తే దక్షిణ కొరియాపై దాడులకు ఉత్తర కొరియా దూకుడుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

దక్షిణ కొరియా కాల్పులు జరిపిందా?

సరిహద్దుల్లో దాయాది ధ్వంసం ఓవైపు జరుగుతుండగా.. ప్రతిగా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపిందే కథనాలు వస్తున్నాయి. అంతేగాక తమ ప్రజల భద్రతకు ప్రామాదం కలిగితే ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది. ఇదే నిజమైతే కొరియా ద్వీపకల్పం ప్రమాదంలో పడినట్లే. కాగా, 2000 సంవత్సరంలో ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడడంతో రోడ్లను నిర్మించారు. రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేశారు. వీటికి భారీ భద్రత కల్పించారు. ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు.

యుద్ధం జరిగితే దక్షిణ కొరియా ఖతం

విద్యార్థులు, యూత్‌ లీగ్‌ అధికారులతో సహా సుమారు 14 లక్షల మంది యువకులు సైన్యంలో చేరడాన్ని ధ్రువీకరిస్తూనే ఉత్తర కొరియా మీడియా చేసిన భయంకరమైన హెచ్చరిక ఏమంటే.. ‘విప్లవం, ఆయుధాలతో శత్రువును నాశనం చేసే పవిత్ర యుద్ధంలో పోరాడాలని యువకులు నిశ్చయించుకున్నారు. యుద్ధం జరిగితే ప్రపంచపటం నుంచి దక్షిణ కొరియా తుడిచిపెట్టుకుపోతుంది. దాని ఉనికిని అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొంది.

Tags:    

Similar News