హైదరాబాద్ లో ఇంజినీరింగ్.. ఫీజుల్ని భారీగా పెంపునకు ఓకే

దీనికి మించి అన్నట్లుగా మరో కాలేజీ వ్యవహారం ఉంది. బాచుపల్లికి చెందిన వీఎన్ఆర్ కాలేజీలో ఇప్పటివరకు ఏడాదికి రూ.1.35 లక్షల చొప్పున వసూలు చేసేది.;

Update: 2025-03-12 08:10 GMT

హైదరాబాద్ మహానగరంలో కొన్ని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో మీ పిల్లల్ని చదివించాలని భావిస్తున్నారా? అయితే.. అప్రమత్తం కండి. వచ్చే విద్యా సంవత్సరానికి వసూలు చేసే ఫీజులకు సంబంధించి సదరు కాలేజీలు చేసుకున్న విన్నపాలకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ ఓకే చెబితే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు భారీగా పెరగనున్నాయి.

అదెంత భారీగా ఉన్న దానికి రెండు ఉదాహరణలు ఇక్కడ ప్రస్తావిస్తాం. హైదరాబాద్ లోని సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజును రూ.2.23 లక్షలకు ఫిక్స్ చేస్తూ.. అందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరారు. ఇప్పటి వరకు ఈ కాలేజీలో ఇంజనీరింగ్ ఫీజు ఏడాదికి రూ.1.65లక్షలు మాత్రమే ఉండేది. అది కాస్తా ఒకేసారి రూ.53 వేలు పెంచేయటం గమనార్హం. అంటే.. దగ్గర దగ్గర 35 శాతం ఫీజును ఒకేసారి పెంచేందుకు ఓకే చేయాలని కాలేజీ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే.

దీనికి మించి అన్నట్లుగా మరో కాలేజీ వ్యవహారం ఉంది. బాచుపల్లికి చెందిన వీఎన్ఆర్ కాలేజీలో ఇప్పటివరకు ఏడాదికి రూ.1.35 లక్షల చొప్పున వసూలు చేసేది. దాని ఫీజును తాజాగా రూ.2.20 లక్షలకు పెంచేస్తూ అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వ అనుమతిని కోరారు. ఈ పెంపు లెక్క చూస్తే.. ఏడాదికి ఒక్కో విద్యార్థి మీద అదనంగా రూ85 వేలు భారం పడుతుందన్న మాట. ఈ పెంపును శాతాల్లో చూస్తే.. దగ్గరదగ్గర 65 శాతం పెంచేసినట్లుగా చెప్పాలి. మొత్తం కోర్సు పూర్తి అయ్యే నాలుగేళ్లకు రూ.3.40 లక్షల వరకు అదనపు భారం పడుతుంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే ట్రస్టు నడిపించే ఈ కాలేజీకి ఇంత భారీగా ఫీజులు పెంచేయటం దేనికి సంకేతం? అన్నది ప్రశ్నగా మారింది. వచ్చే మూడేళ్లకు బ్లాక్ పిరియడ్ కు కొత్త ఫీజులు ఖరారు చేసేందుకు వీలుగా కాలేజీల యాజమాన్యాలతో.. వాటి ప్రతినిధులతో విచారణ చేపట్టిన అధికారులు.. ఆయా కాలేజీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులను పరిశీలించి కొత్త ఫీజులకు ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. తాము ఖరారు చేసిన ఫీజుల వివరాల్ని ఉన్నత విద్యా శాఖాధికారులు ప్రభుత్వ అనుమతి కోసం ఫైలు పంపారు.

ఆ రిపోర్టును పరిశీలించి.. అందుకు ఓకే చేసి.. జీవో రిలీజ్ చేస్తే.. ఫీజులు పెరగనున్నాయి. ఒకవేళ.. పెంపు ఎక్కువగా ఉందని భావిస్తే మాత్రం.. ప్రభుత్వం పెంపు ఫీజుల్ని మరోసారి రివ్యూ చేయాలని కోరొచ్చు. మరి.. అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఫీజుల్ని భారీగా పెంచేస్తూ ప్రభుత్వానికి అధికారులు రికమండ్ చేసిన టాప్ 5 కాలేజీలు.. పాత ఫీజులు.. కొత్త ఫీజుల లెక్క చూస్తే.. విషయం మీకు ఇట్టే అర్థమవుతుంది.

కాలేజీ పేరు పాత ఫీజు (రూ.లక్షల్లో) కొత్త ఫీజు (రూ.లక్షల్లో)

సీబీఐటీ 1.65 2.23

వీఎన్ఆర్ 1.35 2.20

వాసవి 1.40 2.15

ఎంజీఐటీ 1.60 2.00

సీవీఆర్ 1.50 1.60

Tags:    

Similar News