అసెంబ్లీలో జగన్ ప్లేస్ మరీ అంత వెనక్కా ?

ఆ నంబర్ చాలా పెద్దది. అలా జగన్ అసెంబ్లీకి మూడేళ్ల పాటు వచ్చినా ఆయన సీటు హోదా గౌరవానికి ఏమీ భంగం వాటిల్లలేదు

Update: 2024-06-06 17:30 GMT

జగన్ రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన సమయం ఇది. ఆయన ఓడినా గెలిచినా ఈ తరహా అనుభవాలు గతంలో ఎపుడూ చూడలేదు. ఎందుకంటే 2014లో జగన్ 67 మంది ఎమ్మెల్యేలతో దర్జాగా ప్రధాన ప్రతిపక్ష నేతగా అపొజిషన్ బెంచ్ లలో కూర్చున్నారు.

ఆ నంబర్ చాలా పెద్దది. అలా జగన్ అసెంబ్లీకి మూడేళ్ల పాటు వచ్చినా ఆయన సీటు హోదా గౌరవానికి ఏమీ భంగం వాటిల్లలేదు. ఇక 2019లో జగన్ 151 సీట్లతో సీఎం అయ్యారు. ఇక అసెంబ్లీ అంతా వైసీపీ కనిపించింది. ఆ వైభోగమే వేరే లెవెల్ అన్నట్లుగా కధ సాగింది.

ఈ రెండూ చూసిన జగన్ కి 2024 ప్రజాల తీర్పు అసలు మింగుడు పడడంలేదు అని అంటున్నారు. జగన్ నాయకత్వంలోని వైసీపీకి ఈసారి గట్టిగా 18 సీట్లు కూడా దక్కలేదు. ఎందుకంటే ఈ నంబర్ చాలా ముఖ్యం. మెయిన్ అపొజిషన్ దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా నంబర్.

కానీ ఈ నంబర్ కి జగన్ ఏకంగా ఏడు సీట్ల దూరంలో నిలిచి పోయారు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. తొందరలోనే సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేస్తారు. ఆ వెంటనే ఆయన అసెంబ్లీని సమావేశపరచి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది.

పూర్తి బడ్జెట్ ని సమర్పించాల్సి ఉంటుంది. దాంతో అసెంబ్లీకి అధికార విపక్షాలు రావాల్సి ఉంటుంది. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన సీటు ఎక్కడా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. జగన్ అసెంబ్లీలో ఎన్నో వరసలో కూర్చుంటారు అన్నది కూడా మరో చర్చగా ముందుకు వస్తోంది.

ఆయన పార్టీకి ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే. దాంతో ఆయనకు అపోజిషన్ లో ఫస్ట్ బెంచెస్ అయితే కేటాయించే అవకాశం లేదు అని అంటున్నారు. ఇక స్పీకర్ ఇష్టం మీద అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. జగన్ కూడా ఒక సాధారణ మెంబర్ గానే ఉంటారు. ఆయన పార్టీ మెంబర్స్ కూడా అంతే.

అసెంబ్లీ రూల్స్ ప్రకారం సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడికీ ప్రివిలేజేస్ ఉంటాయి. మరి అపొజిషన్ కి సరిపడా సీట్లు తెచ్చుకోలేదు కాబట్టి జగన్ కి ఎన్నో బెంచ్ అపోజిషన్ లో కేటాయించాలి అన్నది స్పీకర్ డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అలా చూస్తే కనుక తొమ్మిదవ వరసలో జగన్ కి ఆయన పార్టీ వారికీ సీట్లు కేటాయించవచ్చు అని ఒక చర్చ కూడా సాగుతోంది.

ఇక టీడీపీ కూటమి అంతా అసెంబ్లీని ఈసారి నిండుగా పరచుకుంటుంది. వారే అధికార పక్షం. వారే ప్రతిపక్షంగానూ ఉంటారు. దాంతో మైకులు వైసీపీ వారికి దొరుకుతాయా అన్నది మరో చర్చ. నామమాత్రం విపక్షంగానే వైసీపీ ఉండబోతోంది. జగన్ కి ఒక సభ్యునికి ఇచ్చే సమయం మాత్రమే ఇస్తారు. అది కూడా స్పీకర్ అనుకుంటేనే. మరి కూటమి నుంచే స్పీకర్ నెగ్గుతారు కాబట్టి ఆయన ఇచ్చే టైం మైకూ జగన్ కి ఎంత ఏమిటి అలాగే జగన్ కి విపక్షంలో కేటాయించే సీటు ఎక్కడా ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఏది ఏమైనా వైసీపీకి ఈసారి అసెంబ్లీలో పూలమ్ముకున్న చోటనే కట్టెలమ్ముకున్న పరిస్థితి అని అంటున్నారు.

Tags:    

Similar News