కొండా వ్యాఖ్యలేమో కానీ దెబ్బకు హైడ్రా వెనక్కి వెళ్లిపోయింది

కొండా సురేఖ వ్యాఖ్యలతో ప్రధాన మీడియా మొదలు సోషల్ మీడియా వరకు ఆమె మాటలే హెడ్ లైన్స్ గా మారాయి

Update: 2024-10-03 04:37 GMT

సోదరభావంతో తన మెడలో వేసిన నూలుదండకు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెట్టిన పోస్టుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గాంధీ జయంతి రోజున చెలరేగిపోయిన వైనంతో ఆమె వార్తల్లో ప్రధాన వార్తగా మారిపోయారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులకు సంబంధించి సూటిగా.. ఎలాంటి మొహమాటం లేకుండా వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడిన వైనం.. దానికి మాజీ మంత్రి కేటీఆర్ కు లింకు పెడుతూ చేసిన వ్యాఖ్యలతో వ్యవహారం మొత్తం మారిపోయింది.

కొండా సురేఖ వ్యాఖ్యలతో ప్రధాన మీడియా మొదలు సోషల్ మీడియా వరకు ఆమె మాటలే హెడ్ లైన్స్ గా మారాయి. దీనికి తోడు.. ఆమె మాటల్ని తీవ్రంగా తప్పు పడుతూ సినీ రంగానికి చెందిన పలువరు గళమెత్తటం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ కారణంగానే సమంత -నాగచైతన్య విడాకులు తీసుకున్నారన్న కొండా సురేఖ మాటలు తీవ్ర సంచలనానికి.. అంతకు మించిన పెను దుమారానికి కారణమయ్యాయి. ఆమె వ్యాఖ్యల్ని కేటీఆర్.. అక్కినేని నాగార్జున. ఆయన సతీమణి అమల.. నాగచైతన్య.. సమంత.. ప్రకాశ్ రాజ్.. నాని.. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సీరియస్ గా రియాక్టు అయ్యారు.

ఈ జోరుకు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వార్తల ప్రాధాన్యాలు మారిపోయాయి. అందరూ ఇప్పుడు కేటీఆర్.. సమంత.. నాగచైతన్యల మీద మాట్లాడుకోవటం ఎక్కువైంది. అయితే.. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా పరిణామాలతో ఇప్పటివరకు హాట్ టాపిక్ గా ఉన్న హైడ్రా వెనక్కి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటల సంగతేమైనా.. ఆమె కారణంగా రేవంత్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హైడ్రా వ్యవహరం తెర వెనక్కి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. మంత్రి కొండా సురేఖ మాటల మంటలు ఏ మేరకు వ్యాపిస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News