రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. భర్తను అరెస్ట్ చేయలేరా! కోర్టు ఏమంది?
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెంగళూరు విమానాశ్రయంలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన రన్యా అరెస్ట్ అయి విచారణను ఎదుర్కొంటోంది. నటి రన్యా రావు భర్త జతిన్ వి హుక్కేరి, ఆమె సవతి తండ్రి అయిన డీజీపీ పైనా విచారణ సాగనుందని కథనాలొచ్చాయి. అయితే రన్యారావు భర్త పై చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఎటువంటి బలవంతపు చర్యను ప్రారంభించవద్దని కర్ణాటక హైకోర్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI)ని తాజా విచారణలో ఆదేశించింది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు తన భార్యపై నమోదైన కేసులో డిఆర్ఐ అరెస్టును నిరసిస్తూ జతిన్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై ఏదైనా బలవంతపు చర్య తీసుకునే ముందు డిఆర్ఐ చట్టబద్ధమైన ప్రక్రియను పాటించాలని ఆదేశించాలని జతిన్ కోర్టును కోరారు. దీనిపై కోర్టు విచారించింది. నటి రన్యారావుపై వచ్చిన ఆరోపణలను ఆమె భర్తతో ముడిపెట్టలేమని జతిన్ తరపు న్యాయవాది వాదించారు. డిఆర్ఐ అతనికి సమన్లు జారీ చేసినప్పుడు, రెండుసార్లు విచారణకు తీసుకెళ్లినప్పుడు కూడా ఆయన దర్యాప్తునకు సహకరించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని పాటించకుండా అరెస్టు చేసే అవకాశం ఉందని లాయర్ వాదించారు.
న్యాయస్థానంలో చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా డిఆర్ఐ అధికారులు తనను పదే పదే విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేస్తున్నందున చట్టవిరుద్ధమైన విధానంపై తాను అసంతృప్తి చెంది హైకోర్టును ఆశ్రయించానని జతిన్ వాదనలు వినిపించారు. సమన్లు జారీ చేయకుండా అధికారులు చట్టవిరుద్ధంగా నిర్బంధించడానికి పదే పదే ప్రయత్నిస్తున్నారని, తనను వేధిస్తున్నారని వాదించారు. భర్త జతిన్ కి రన్యారావుతో దీర్ఘకాలిక సంబంధాలేవీ లేవని, పెళ్లి తర్వాత బంధం మాత్రమే ఉందని కోర్టులో న్యాయవాది వాదనలు వినిపించారు.
దర్యాప్తు పేరుతో తమకు అనుకూల ప్రకటనలు చేయించేందుకు డిఆర్ఐ జతిన్ ని వేధిస్తోందని అతడి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. పదే పదే మానసికంగా గాయం చేస్తున్నారని, వేధింపుల కారణంగా, పిటిషనర్ జతిన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికారణంగానే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని న్యాయవాది తెలిపారు.