బాబు.. పవన్ లకు స్వామి పంచ్ లు మామూలుగా లేవుగా?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి

Update: 2023-07-15 06:25 GMT

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడైనా.. ఏదైనా అంశాన్ని టేకప్ చేస్తే.. దానికి తిరుగు ఉండదు.

ఇప్పటికే తోపుల్లాంటి ప్రముఖులకు తన వాదనతో చుక్కలు చూపించి.. వారి జీవితాల్లో ఊహించని షాకులు ఇచ్చిన ఆయన.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాల్ని చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లు దెబ్బ తీస్తున్నట్లుగా మండిపడ్డారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)నిర్వహించే కార్యక్రమాల మీదా.. శ్రీవాణి ట్రస్టు ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తిరుమలలో అన్యమత ప్రచారం జరగటం లేదన్న ఆయన.. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో పోరాడని చంద్రబాబు అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారని.. కాగ్ ద్వారా ఆడిట్ చేసేందుకు టీటీడీ స్వయంగా ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

చంద్రబాబు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ మతపరమైన విషయాల్లో దూరంగా ఉండాలన్న హితవు పలికి స్వామి.. టీటీడీకి తాను న్యాయసాయం చేస్తానని వ్యాఖ్యానించారు. త్వరలోనే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం చేసుకుంటానని చెప్పిన సుబ్రహ్మణ్య స్వామి.. చంద్రబాబు హిందువులకు చేసిందేమీ లేదన్నారు.

సొంత మామకు గౌరవం ఇవ్వని వ్యక్తి హిందువులకు ఎలా గౌరవం ఇస్తాడన్న ఆయన.. హిందూదేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదన్న స్వామి.. టీటీడీని అప్రదిష్ట పాలు చేసేందుకు టీడీపీ.. జనసేనలు ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించటం గమనార్హం.

Tags:    

Similar News