లండన్ నుంచి వచ్చాక జగన్ తొలి కీలక నిర్ణయం

వైసీపీ ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు భారీ నిరసన కార్యక్రమానికి ఆదిలోనే దెబ్బ పడింది.;

Update: 2025-02-04 03:37 GMT

వైసీపీ ఈ నెల 5న నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు భారీ నిరసన కార్యక్రమానికి ఆదిలోనే దెబ్బ పడింది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. క్రిష్ణా గుంటూరు, ఉభయగోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాంతో ఏడు ఉమ్మడి జిల్లాలలో కోడ్ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో నిరసనలు ఆందోళనలు రాజకీయ పార్టీలు నిర్వహించేందుకు అవకాశం ఉండదు.

మిగిలిన జిల్లాలలో వీటిని చేపట్టవచ్చు. అయితే ఏపీ మొత్తంగా ఆందోళనా కార్యక్రమాలను చేపట్టాలని భావించిన వైసీపీకి మెజారిటీ జిల్లాలలో కోడ్ ఉండడం ఇబ్బందికరంగా పరిణమించింది. దీని మీద మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ ఆందోళనలకు అవకాశం ఇవ్వాలని అందులో కోరారు.

అయితే ఈసీ నుంచి స్పందన రాకపోవడం వైసీపీ తలపెట్టిన భారీ కార్యక్రమం ఫీజు పోరుకు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉండడంతో చివరికి వైసీపీ అధినాయకత్వం తన ఆందోళనా కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్న తరువాత తీసుకున్న కీలక నిర్ణయం ఆందోళనలు వాయిదా కావడం విశేషం.

ఇక ఈ ఆందోళనను ఏకంగా మార్చి 12కి వాయిదా వేశారు. అంటే అయిదు వారాల ముందుకు అన్న మాట. అప్పటికి ఏపీలో ఎన్నికల కోడ్ ముగుస్తుంది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఇప్పటికే ఫీజు పోరు మీద పార్టీ పోస్టర్ ని రిలీజ్ చేసింది. అంతా ఆందోళనలు సిద్ధం అయ్యారు.

దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకులు ముఖ్య నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ క్యాడర్ కి హుషార్ తెచ్చారు. ఇపుడు సడెన్ గా వాయిదా పడడంతో వైసీపీలో నిస్తేజం ఆవహించింది. వైసీపీ ఇప్పటికే ఏడు నెలలుగా పెద్దగా యాక్టివిటీ లేకుండా ఉంది. ఇపుడిపుడే జనంలోకి నేతలు అంతా వస్తున్న వేళ ఈ రకంగా వాయిదా పర్వానికి తెర తీయడం నిరుత్సాహాన్ని కలిగిస్తుందని అంటున్నారు.

అయితే ఇది ఎన్నికల కోడ్ వల్ల వచ్చిన ఇబ్బంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు వాయిదా పడడం అన్నది ఒక రకమైన అవాంతరం గానే చూస్తున్నారు ప్రత్యేకించి ఫీజు పోరు ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది. మరి ఈ కీలక సమయంలో కూటమి ప్రభుత్వం కనుక ముందుకు వచ్చి ఫీజుల విషయంలో అనుకూల నిర్ణయం తీసుకుంటే ఫీజు పోరు వాయిదా కాస్తా ఇక పూర్తిగా ఉండకపోయినా పోవచ్చు అని అంటున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఒక అవకాశమే అని చెబుతున్నారు.

Tags:    

Similar News