గుంటూరులో ఘోరం.. 9వ తరగతి బాలిక గ్యాంగ్ రేప్

Update: 2022-05-20 04:55 GMT
ఏపీలో అత్యాచారాల పర్వం నిరాటంకంగా సాగుతోంది. ఎన్నెన్ని ఘోరాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నా.. వాటి మీద చర్యలు అంతంతమాత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్న దుస్థితి. తాజాగా చోటు చేసుకున్న గ్యాంగ్ రేప్ కు సంబంధించిన కేసు నమోదు విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తొమ్మిదో తరగతి చదివే బాలికను మాయమాటలు చెప్పి.. గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని అద్యంతం గోప్యంగా ఉంచటానికి పోలీసులు ప్రయత్నించారన్న మాట పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఇంట్లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలన్న అంశంతో పాటు.. దారి తప్పేలా ఉండే వారి తీరును గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పాలి. ఇంతకూ జరిగిందేమంటే..

గుంటూరు శివారకు చెందిన పదిహేనేళ్ల బాలిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం ఆమెకు ఇన్ స్టాలో తాడికొండ మండలం గరికపాడుకు చెందిన 19 ఏళ్ల గ్రేస్ బాబుతో పరిచయమైంది.

అతడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆ బాలికకు తన స్నేహితులైన రిక్కీ(19) .. మణికంఠ(19)లను పరిచయం చేశాడు గ్రేస్ బాబు. వారు కూడా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. బుధవారం వీరంతా గుంటూరు నగర శివారు ఇన్నర్ రింగు రోడ్డులోని ఒక హోటల్ లో గదిని అద్దెకు తీసుకున్నాడు. మద్యం సేవించిన వారు మధ్యాహ్నం ఒంటి గంటకు రిక్కీ సదరు బాలికకు వీడియో కాల్ చేశాడు.

మద్యం తాగిన గ్రేస్ బాబు హోటల్లో పడిపోయాడని.. మీరు వస్తేనే అన్నంత తింటాడని నమ్మించారు. టూవీలర్ మీద ఆ బాలిక ఇంటికి వెళ్లిన ఇద్దరు.. వారింట్లో తల్లిదండ్రులు లేకపోవటంతో.. మాయ మాటలు చెప్పి బైక్ ఎక్కించుకొని హోటల్ కు తీసుకొచ్చారు.

బాలికకు మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లగానే రిక్కీ.. మణికంఠలు అత్యాచారానికి పాల్పడ్డారు. నల్లపాడు పోలీస్ స్టేషన్  కు అరకిలోమీటర్ దూరంలోనే ఈ దారుణం జరిగింది. ఈ దారుణం వెలుగు చూసిన గంటల పాటు కూడా కేసు నమోదు చేయకపోవటం.. బాలిక స్నేహితుడు గ్రేస్ బాబుపై కేసు నమోదు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి.

బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు.. అనంతరం అపస్మాకర స్థితిలో ఉన్న ఆమెను ఇంటికి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. ఇంట్లో వారికి జరిగింది చెప్పటంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించి.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను జీజీహెచ్ కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో వరుస పెట్టి జరుగుతున్న అత్యాచార పర్వానికిదో నిదర్శనమని చెబుతున్నారు.
Tags:    

Similar News