కేసీఆర్ నుంచి సీల్డ్ క‌వ‌ర్ వ‌చ్చింది.. ఏం చేయ‌మంటారు?.. హైకోర్టు సీజే ప్ర‌శ్న‌.. కోర్టులో క‌ల‌క‌లం!

Update: 2022-11-16 07:30 GMT
టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్ నుంచి త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా(కార్యాల‌యానికి) సీల్డ్ క‌వ‌ర్ ఒక‌టి అందింద‌ని, దానిని ఏం చేయాల‌ని?  తెలంగాణ‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించడంతో న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో క‌ల‌క‌లం రేగింది. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి నేరుగా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా చేయ‌లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.  ఏం చేయాలని మరో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా సంప్రదించారన్నారు.  దీంతో ఒక్క‌సారిగా హైకోర్టులో పిన్ డ్రాప్ సైలెన్స్అన్న‌ట్టు అంద‌రూ నివ్వెర‌పోయారు. ఈ ఘ‌ట‌న తాజాగా జ‌రిగింది.

కేసీఆర్ పంపించిన సీల్డ్ క‌వ‌ర్‌లో ఒక సీడీ, పెన్‌ డ్రైవ్‌ తదితరాలు ఏవో ఉన్నాయని.. వాటిని అలాగే సీల్‌ చేసి పక్కన ఉంచాలని చెప్పానని సీజే వెల్లడించారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ న్యాయ‌వాదికి ముందు నోట మాట రాలేదు. ఏం జ‌రుగుతుందోన‌ని.. ఎలాంటి ఆదేశాలు ఇస్తారోన‌ని ఆయ‌న హ‌డలిపోయారు. ఆవెంట‌నే తేరుకుని న్యాయ‌మూర్తికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ కవర్ను పట్టించుకోవద్దని.. దాన్ని పడేయాలని  న్యాయవాది  సూచించారు.
 
తాజాగా హైకోర్టులో ఫామ్‌హౌజ్‌లో 'ఎమ్మెల్యేల‌కు కోట్లు' కేసులో అప్పీలుపై విచారణ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే సమాధానమిస్తూ.. అలా జరిగి ఉండాల్సింది కాదని, బేషరతు క్షమాపణ చెబుతున్నానన్నారు.

ఇది చట్టవిరుద్ధమైన చర్య అని చెప్పారు. ఇది బాధాకరమని.. నేరుగా న్యాయమూర్తికి పంపడంపై ఆందోళన వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలు ఇలా దర్యాప్తు విషయాలను వెల్లడించరాదన్నారు.

అయితే, అన్ని దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని వెల్లడించడం సహజమైపోయిందని చెప్పారు. ఈడీ, సీబీఐలు కూడా దర్యాప్తు అంశాలు, ఆధారాలన్నింటినీ మీడియాకు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయ సమరాలకు న్యాయవ్యవస్థలను వేదిక చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకోవాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌కు కూడా సలహా ఇస్తానన్నారు. టీఆర్ ఎస్‌ అధ్యక్షుడి నుంచి వచ్చిన కవర్‌ను పట్టించుకోవద్దని.. లేదంటే దాన్ని పడవేయాలని సూచించారు.

న్యాయమూర్తులకు సీల్డ్‌ కవర్లు పంపడం న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారనడానికి నిదర్శనమని బీజేపీ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ పేర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇవే రికార్డులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపామని ప్రకటించారని.. అలా పంపడం తీవ్రమైన విషయమేనన్నారు. దీనిపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి.. 'త‌ర్వాత దీనిపై మాట్లాడ‌తాను' అని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News