మోడీ కేబినెట్‌లోకి ఒక తెలంగాణ ఎంపీ?

Update: 2022-09-06 14:01 GMT
బీజేపీ హైకమాండ్ తెలంగాణను సీరియస్‌గా తీసుకుంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపైనే ఆశలు పెంచుకుంది. చరిత్రలో తొలిసారిగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పసిగట్టిన ఆ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

2023 ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాష్ట్రంలోని బీసీ జనాభాను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో తెలంగాణకు మరో కేంద్ర కేబినెట్‌ బెర్త్‌ ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. తెలంగాణలో బీసీ జనాభా శాసించే స్థాయిలో ఉంది. ఇక యువత కూడా బాగా ఉంది. వారందరూ బీజేపీ వైపు మరలడానికి ఈ ఎత్తుగడ వేస్తున్నట్టు అర్థమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని చూస్తున్నారు. తెలంగాణకు ఇందులో మరో బెర్త్ లభిస్తుందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో అధికారం సంపాదించేందుకు మోడీ, షాలు ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది.

తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. కేబినెట్‌లో కిషన్‌రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ ఎంపీల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ ముందంజలో ఉన్నారు. వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తారో చూడాలి.

2018లో బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఏపీలో బీజేపీకి సొంతంగా గెలిచిన ఒక్క ఎంపీ కూడా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి జీవీఎల్ ను రాజ్యసభ ఎంపీగా పంపినా ఆయనకు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవు.

తెలంగాణలో కేసీఆర్ జాతీయ నేతగా పోటీగా వస్తుండడంతో ఎలాగైనా సరే కేసీఆర్ ను ఓడించి తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ అధిష్టానం స్కెచ్ గీస్తోంది. ఈక్రమంలోనే ఎన్నడూ లేనంతా సీరియస్ గా తెలంగాణకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ ను బీజేపీ కార్యనిర్వాహక కమిటీలోకి తీసుకున్నారు. తాజాగా మరో బీజేపీ ఎంపీకి కేంద్ర కేబినెట్ లో చోటు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ లేదంటే ధర్మపురి అరవింద్ లలో ఒకరికి కేంద్ర కేబినెట్ లో ఈసారి చోటు దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News