అత్యాచారాల బిషప్‌ పై కార్టూన్.. అవార్డు గొడవ

Update: 2019-06-18 11:23 GMT
క్రైస్తవ సన్యాసినులను అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ పై వ్యంగ చిత్రం గీసిన కార్టూనిస్టు కేకే సుభాష్‌ కు అవార్డు ఇవ్వొద్దని కోరిన కేరళ ప్రభుత్వ అభ్యర్థనను ఆ రాష్ట్ర లలిత కళా అకాడమీ తిరస్కరించింది. బిషప్ ఫ్రాంకో  ములక్కల్ చేతిలో ఉన్న పవిత్ర దండానిక లోదుస్తులు ఉన్నట్లుగా ఉన్న ఆ కార్టూన్‌ ను నిరసిస్తూ కేరళ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్సుకు చెందిన కొందరు నిరసన తెలిపారు. దాన్ని చూపుతూ పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ వామపక్ష ప్రభుత్వం... సుభాష్‌ ఎంపికను సమీక్షించాలంటూ లలిత కళా అకాడమీని కోరింది.

అయితే, అకాడమీ కౌన్సిల్ సమావేశం తరువాత అకాడమీ చైర్మన్ నేమమ్ పుష్ఫరాజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. అకాడమీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, కౌన్సిల్ రెండూ తమ నిర్ణయాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదని తేల్చాయన్నారు. కేరళ లలిత కళా అకాడమీ ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో స్వతంత్రంగా పనిచేస్తుంది.

అయితే.. కేరళ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్(కేకేబీసీ) మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. కేరళ సమాజం మొన్నటి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు ఓట్లేయకపోవడంతో ప్రతీకారంగా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ ఒత్తిడి పెంచుతోంది. కాగా.. కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి ఈ వ్యవహారంపై స్పందిస్తూ... కార్టూన్ అభ్యంతరకరంగా ఉందని చెప్పారు. అయితే.. నిపుణుల కమిటీనిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వం ఈ విషయంలో ఏమీచేయలేదన్నారు.
 
    

Tags:    

Similar News