షాక్.. సూసైడ్ చేసుకున్న మారుతిరావు

Update: 2020-03-08 04:43 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఉదంతం గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తనకు నచ్చని వ్యక్తిని తన కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందన్న ఆగ్రహంతో.. కిరాయి గూండాల్ని పెట్టించి దారుణంగా హత్య చేయించిన వైనం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

ఈ వ్యవహారంలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో.. సోషల్ మీడియాలో మారుతిరావుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అయ్యారు. దీంతో.. మారుతిరావు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. కుమార్తె భర్తను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన మారుతిరావు.. తాజాగా హైదరాబాద్ లోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది.

అనుమానాస్పద మరణంగా పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఖైరతాబాద్ లోని శ్రీ ఆర్యవైశ్య భవన్ లోని లాడ్జిలోపల గడియ పెట్టుకొని విగతజీవి పడిపోయిన మారుతిరావుది ఆత్మహత్యే అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం తన పేరున రాస్తానని మధ్యవర్తులతో కుమార్తెకు రాయబారం పంపినట్లుగా చెబుతారు. పీడీ యాక్ట్ కేసులో ఆర్నెల్ల క్రితం విడుదలైన మారుతీరావు.. అప్పటి నుంచి కుమార్తె అమృతను వేధిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తనను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నట్లుగా మారుతిరావు తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా చెబుతారు. ఏది ఏమైనా.. సంచలనాల మారుతిరావు..చివరకు ఎవరూ ఊహించనిరీతిలో ఆత్మహత్య చేసుకొని మరణించటం గమనార్హం. ప్రస్తుతం అతని డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News