పబ్ జీ గేమ్ లో ఓటమి.. ఆంధ్రా బాలుడి ఆత్మహత్య

Update: 2022-06-13 11:32 GMT
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన 15 ఏళ్ల బాలుడు పబ్‌జీ గేమ్‌లో ఓడిపోయినందుకు అవమానానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వూటుకూరు ప్రభుగా గుర్తించారు. ఆదివారం ఉదయం ఉరివేసుకుని కనిపించాడు. కారణం ఏంటని ఆరాతీయగా పబ్ జీలో ఓటమి అని తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభు వేసవి సెలవులను తండ్రితో గడిపేవాడు. ప్రభు తండ్రి, తల్లి కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకుని విడివిడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభు మొబైల్‌లో గంటల తరబడి పబ్‌జీ ఆడేవాడని, శనివారం రాత్రి తన కజిన్‌తో కలిసి మల్టీప్లేయర్ గేమ్ ఆడాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ప్రభు ఆటలో ఓడిపోయాడు. బాగా ఆడినప్పటికీ  ఓడిపోయాడని మిగతా కుటుంబ సభ్యులు ఆటపట్టించారు. కుటుంబం ముందు జరిగిన అవమానంతో కలత చెంది, ప్రభు ఒంటరిగా గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఉదయం అతని తండ్రి  తలుపులు తీసి చూడగా.. తన కొడుకు విగతజీవిగా కనిపించాడు. తలుపులు పగలగొట్టి బయటకు తీశారు.

అయితే కుమారుడి మృతిపై ప్రభు తల్లికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పబ్ జీ, మొబైల్ గేమ్ ముఖ్యంగా యుక్తవయస్కుల వారిలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు పబ్‌జీ ఆడకుండా అడ్డుకున్నందుకు తల్లిని హత్య చేశాడు. తాజా సంఘటన పబ్ జీ ప్రతికూల ప్రభావాలకు మరొక ఎపిసోడ్ గా మారింది.
Tags:    

Similar News