చంద్ర‌బాబు ఖాతాలో మ‌రో ఘ‌న‌త‌

Update: 2015-09-21 05:30 GMT
ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఖాతాలో మ‌రో ఘ‌న‌త చేరింది. విద్యుత్‌ నష్టాల తగ్గింపులో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా మారింది. నష్టాల తగ్గింపులో ఆంధ్ర ప్రదేశ్‌ పాటించిన పద్ధతులు ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేయాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు మొదటి నుంచి నష్టాల తగ్గింపుపై దృష్టి పెట్టారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నర కాలంలోనే నష్టాలను గణనీయంగా తగ్గించగలిగారు. ఇటీవలే విద్యుత్‌ రంగానికి సంబంధించి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంపిణీ నష్టాలను తగ్గించుకోవడమెలాగో ఏపీని చూసి నేర్చుకోవాలని సూచించారు. తాజాగా వివ‌రాల‌ను  ఏపీ ట్రాన్స్‌ కో, జెన్‌ కో సీఎండీ కె.విజయానంద్‌ వివరించారు.

2010-11లో సమైక్య రాష్ట్రంలో విద్యుత్‌ నష్టాలు 17.05 శాతంగా ఉండేవని, 2015 ఆగస్టు నాటికి ఇవి 10.54 శాతానికి తగ్గాయని విజయానంద్‌ తెలిపారు. రూ.1,950 కోట్లు మేర పొదుపు చేయగలిగామని అన్నారు. 2010 నుంచి పంపిణీ నష్టాలను దాదాపుగా 7 శాతం తగ్గించామ‌ని - విద్యుత్‌ పంపిణీ - సరఫరా నష్టాలను ఒక శాతం తగ్గించ గలిగితే రూ.300 కోట్లు ఆదా అవుతాయని ఆయ‌న వివ‌రించారు. విద్యుత్‌ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న విధానా లను కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తోందని పేర్కొన్నారు.

విద్యుత్‌ పంపిణీ - సరఫరా నష్టాల తగ్గింపు ఏపీ తీసుకుంటున్న చర్యలపై కేంద్రం సంతృప్తిని వ్యక్తం చేస్తోందని, ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నష్టాలను సింగిల్‌ డిజిట్‌ కు తగ్గించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు. 2016-17 సంవత్సరానికల్లా ఈ లక్ష్యసాధన కోసం ప్రణాళికను విద్యుత్‌ సంస్థలు రూపొందించుకున్నాయని విజయానంద్‌ అన్నారు. నష్టాల తగ్గింపు కోసం రాబోయే కాలం లో దాదాపు రూ.27 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని నిర్దేశించుకున్నాయని, వినియోగదారులకు మేలు చేసేలా తీసుకున్న చర్యల వల్ల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందని చెప్పారు. తొలి దశలో రాష్ట్రానికి రూ.2,400 కోట్ల ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచబ్యాంకు ముందుకు వచ్చిందని, జపాన్‌ కు చెందిన జైకా కూడా రాష్ట్రంలో హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని వివరించారు.

వివిధ రాష్ట్రాల్లో 2015 నాటికి మొత్తం విద్యుత్‌ సరఫరా - పంపిణీ నష్టాలు - ఎటి అండ్‌ టి నష్టాల వివరాలిలా ఉన్నాయి.

1. ఆంధ్రప్రదేశ్‌ 10.54 శాతం

2. మహారాష్ట్ర 14.20 శాతం

3. పంజాబ్‌ 14.21 శాతం

4. గుజరాత్‌ 14.60 శాతం

5. హిమాచల్‌ ప్రదేశ్‌ 14.69 శాతం

6. కేరళ 16.04 శాతం

7. కర్నాటక 18.30 శాతం

8. ఉత్తరాంచల్‌ 18.60 శాతం

9. తమిళనాడు 20.92 శాతం
Tags:    

Similar News