ధర్మశ్రీకి కటింగ్...టీడీపీ మాజీకి పట్టం...?

Update: 2022-08-31 17:30 GMT
ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల మీద వైసీపీ పూర్తి ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి జగన్ ఇక్కడ నుంచే మళ్ళీ భారీ ఎత్తున సీట్లు గెలిస్తేనే అధికారం పదిలం అని భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ఎప్పటికపుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటూ మార్పులు చేర్పులు చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీలో రెండేళ్ళ క్రితం చేరిన పంచకర్ల రమేష్ బాబుకు ఇవ్వాలని జగన్ దాదాపుగా డిసైడ్ అయిపోయారు అని అంటున్నారు. రమేష్ బాబు ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో పెందుర్తి నుంచి గెలిచారు. ఆ తరువాత అనకాపల్లి జిల్లాకు వెళ్ళారు. అక్కడ ఉన్న ఎలమంచిలి నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఇక 2019 ఎన్నికల్లో మాత్రం ఆయన ఫస్ట్ టైమ్ ఓడారు. ఆ తరువాత ఆయ‌న వైసీపీలో చేరారు. ఈ మధ్య జగన్ విశాఖ వచ్చినపుడు ఆయనతో ప్రత్యేకంగా మట్లాడారు అని అంటున్నారు. పంచకర్లకు రెండేళ్ళుగా పార్టీ ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయినా సరే ఆయన మిగిలిన నాయకుల మాదిరిగా కాకుండా పార్టీకి విధేయుడిగానే ఉంటూ తన పని తాను చేసుకుని వెళ్తున్నారు. దాంతో పంచకర్లకు పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు అని అంటున్నారు.

అనకాపల్లి వైసీపీ ప్రెసిడెంట్ గా ఆయన్ని నియమించాలని జగన్ భావిస్తున్నారుట. ప్రస్తుతం ఈ పదవి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేతిలో ఉంది. అయితే ఆయనకు అప్పట్లో మంత్రి పదవి ఇవ్వలేదు అన్న కారణం చేత ఈ పదవి ఇచ్చారు. అయినా సరే ధర్మశ్రీ అసంతృప్తిగా ఉండడంతో ఈ మధ్యనే ఆయనకు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన చేతిలో మూడు పదవులు ఉన్నట్లు అయింది.

ఈ లెక్కలను గమనించిన హై కమాండ్ ధర్మశ్రీ నుంచి జిల్లా బాధ్యతలను తీసుకుని పంచకర్లకు అప్పగించాలని చూస్తోంది అని అంటున్నారు. టీడీపీలో ఉన్నపుడు పంచకర్ల జిల్లా అధ్యక్షుడిగా బాగా పనిచేశారు అని పేరు తెచ్చుకున్నారు. దాంతో ఆయన సమర్ధతకు గుర్తింపుగా జిల్లా పగ్గాలు అప్పగిస్తే ఎన్నికల వేళ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని భావిస్తున్నారు.

పంచకర్లకు టీడీపీ వారితో ఉన్న పరిచయాలను కూడా వాడుకోవాలని వైసీఎపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. బలమైన సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో అనకాపల్లి జిల్లాలోని కీలకమైన నాలుగైదు జిల్లాల్లో ఆయన ప్రభావం బాగా ఉంటుంది అని అంచనా కడుతున్నారు. మొత్తానికి ఈ మాజీ టీడీపీ తమ్ముడు జగన్ కి బాగా నచ్చేశారు అంటున్నారు. అందుకే ధర్మశ్రీకి కటింగ్ పెట్టి మరీ ఈయనకు పట్టం కట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News