ఏపీలోలానే.. తెలంగాణలోనూ 'చెప్పు' రాజకీయం

Update: 2022-11-18 10:35 GMT
రాజకీయాల్లో హుందాతనం, భాష దిగజారుతున్నాయి... ఇప్పుడు అందరూ ఒప్పుకొనే మాటే ఇది. ఒకరిని చూసి ఒకరు అన్నట్లు.. వారికి దీటుగా మేము అన్నట్లుగా వ్యక్తిగత దూషణలు పెరిగిపోతున్నాయి. ఇందులో దుర్భాషలూ ఉంటున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు కాస్త రాజకీయాలు హుందాగా సాగుతున్నాయి అనుకున్నవారికి తాజా పరిణామాలు కాస్త ఆందోళన కలిగించక మానవు. పొరుగున ఉన్న ఏపీలో ఇప్పటికే రాజకీయ భాష ప్రమాణాలు పడిపోయాయి. వాడు వీడు అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులను దూషించడం ఏపీ రాజకీయాల్లో సాధారణమైపోయింది. కాగా, తెలంగాణలోనూ రాజకీయ వైరం పెరుగుతున్న కొద్దీ భాషలో హుందాతనం పడిపోతోంది.ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రోజులు రావడంతో వాతావరణం వేడెక్కింది. చాలాకాలంగా కొనసాగుతున్న ఘర్షణపూర్వక వాతావరణం హద్దులు మీరింది.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇంకెంత దూరం వెళ్తుందో? తెలంగాణలో అధికారానికి తహతహలాడుతున్న బీజేపీ.. టీఆర్ఎస్ పైకి దూకుడుగా వెళ్తోంది. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తెను టార్గెట్ చేస్తూ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెకు ప్రమేయం ఉందనేలా ఊహాగానాలకు తెరతీసింది. ఇదే సమయంలో కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అంటూ పార్టీ స్థాపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండడంతో కవితపై ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. కాగా, వీటి మధ్యలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నిక రాజకీయంగా మరింత కాక రేపింది. ఎన్నికకు కొద్ది రోజుల ముందు టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు బీజేపీ ప్రలోభపెట్టిందని, ఇదీ కమలం పార్టీ బాగోతం అంటూ ప్రభుత్వ, టీఆర్ఎస్ పెద్దలు భారీఎత్తున ప్రచారం సాగించారు. మరోవైపు బీజేపీ దీనికి కౌంటర్ ఇవ్వలేక చతికిలపడింది. ఎంత చెప్పినా.. మాటల ద్వారానే తప్ప కేసీఆర్ తరహాలో నలుగురు ఎమ్మెల్యేలను బయటకు తీసుకురాకపోవడంతో బీజేపీ వాదనలో పసలేకపోయింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక ముగియడం, టీఆర్ఎస్ గెలుపొందడం, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఇక్కడ చెప్పుకోవాలి. ఇటీవల బీజేపీవాళ్లు పార్టీ మారమంటూ తన కుమార్తెను ప్రలోభపెట్టారంటూ సీఎం కేసీఆర్ స్వయంగా పేర్కొనడం గమనార్హం. బీజేపీ వల వేస్తుందని, దానికి చిక్కొద్దని వివరిస్తూనే.. పార్టీ మారమని వచ్చేవారిని "చెప్పు"తో కొట్టమంటూ కేసీఆర్ నిర్దేశించారు. ఇప్పుడదే చెప్పుతో కొట్టడం అనే పదం సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నోటి వెంట వచ్చింది.

నిజామాబాద్ వైరం హైదరాబాద్ దాకా కవిత 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. అందులోనూ అర్వింద్.. అప్పటికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన డీ.శ్రీనివాస్ కుమారుడు. డీఎస్ కు ఉన్న అపార అనుభవం, నెట్ వర్క్ .. అర్వింద్ గెలుపునకు ఉపయోగపడ్డాయి. అయితే, ఓటమి పాలైన కవిత నియోజకవర్గంలో తన ప్రయత్నాలను మానలేదు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే రాజకీయ వైరాన్ని ఎదుర్కొంటున్నారు. ఆ క్రమంలో ఎంపీ అర్వింద్ తో మాటకుమాట జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం, పార్టీ మార్పు ఆరోపణలు వీటన్నిటిలో కవిత పేరు బయటకురావడం.. దీనికి నియోజకవర్గ రాజకీయాలు తోడవడంతో ధర్మపురి అర్వింద్ పై ఆమె శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యానించారు.

దీటుగా అర్వింద్ బదులు.. కవిత వ్యాఖ్యలకు అర్వింద్ దీటుగా బదులిచ్చారు. గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న ఉదంతాన్ని గుర్తుచేస్తూ "మీ తండ్రి కేసీఆర్ ను చెప్పుతో కొట్టినవా" అని ప్రశ్నించారు. పదుల సంఖ్యలో ఇతర పార్టీల వారిని చేర్చుకున్న టీఆర్ఎస్ అధినాయకత్వానికి ఇది గట్టి కౌంటర్. మరోవైపు ఎంపీ నిజామాబాద్ లో ఉండగా.. హైదరాబాద్ లోని ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి కలకలం రేపుతోంది. తెరాస ఎమ్మెల్సీ కవితను పార్టీలో చేరాలని భాజపా నేతలు అడిగినట్లు సీఎం కేసీఆరే చెప్పారని.. అప్పుడు ఆయన ఇంటిపై ఎందుకు దాడి చేయలేదని అర్వింద్‌ ప్రశ్నించారు. ఇవాళ తన ఇంటిపై దాడి చేసినట్లే కేసీఆర్‌ ఇంటిపై కూడా కవిత దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. "వ్యాఖ్యలు చేస్తే దాడి చేస్తారా?ఇలా ఇంటిపై దాడి చేయడం సమంజసమేనా? కవిత రాజకీయ బాధను నేను అర్థం చేసుకోగలను. ఆమె రాజకీయ జీవితం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. రాజకీయంగా నన్ను ఓడిస్తానని కవిత అంటున్నారు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఆమెపై పోటీ చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. 2024 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నా. నేను ఏవేవో వ్యాఖ్యలు చేశానని కవిత ఈ స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సీనియర్‌ నేత ఒకరు ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నాకు స్వయంగా ఫోన్‌ చేసి చెప్పారు. మరి ఈ విషయంపైనా విచారణ చేస్తే బాగుంటుంది. అందరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారు కదా.. కవితదీ ట్యాప్ చేస్తే విషయం తేలిపోతుంది. ఇంట్లో ఉన్న నా తల్లిదండ్రులు, ఇంటి సిబ్బంది దాడి చేసే హక్కు ఆమెకు ఎవరిచ్చారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత.. విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారు. ఇదేమన్నా దొరల పాలన అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు.

ఏపీలో చెప్పు రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో గతంలోనే చెప్పుతో కొట్టడం అనే పదం రాజకీయ నాయకుల నోటి నుంచి వచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉండగా.. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. ఓ దశలో చంద్రబాబును చెప్పుతో కొట్టాలి అని వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వైసీపీ నేతలకు చెప్పు చూపారు. తప్పుడు ఆరోపణలు చేసే వైసీపీ వారిని చెప్పుతో కొట్టమని కార్యకర్తలకు సూచించారు. వైసీపీ నేతల వ్యక్తిగత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో కారుకూతల నేపథ్యంలో పవన్ సహనం కోల్పోయి ఆ మేరకు వ్యవహరించారు. ఇప్పుడిదే "చెప్పు" అంశం తెలంగాణకూ చేరడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News