కేజ్రీవాల్ క్రేజీ ఆఫర్ !

Update: 2019-08-08 14:29 GMT
దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రజలు పేదలు - రైతులను ఆకర్షించడానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి పథకాలు ప్రకటిస్తుంటారు. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటర్లు కూలీలు కాదు - రైతులు కాదు. అందుకే ఆయన సంక్షేమ పథకాలు వినూత్నంగా... నగర ప్రజలకు తగ్గట్టు వెరైటీగా ఉంటాయి. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మహా అయితే దశాబ్దం అయ్యింది. కానీ... ఓటు రాజకీయాల్లో బాగా ముదిరిపోయారు.

ఢిల్లీ ఎన్నికలు దగ్గరపతున్న నేపథ్యంలో ఓటర్లు తన గురించే ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటున్నారు కేజ్రీవాల్. తాజాగా సామాన్యులను - యువతను ఆకట్టుకునే క్రేజీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కొక్కరికి ప్రతి నెలా 15 జీబీ డేటా ఫ్రీగా అందజేస్తామని తెలిపింది. దీనికోసం ఢిల్లీ అంతటా 11 వేల హాట్‌ స్పాట్‌ లను ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. అయితే... ఇప్పటికే దీని పనులు ప్రారంభించినట్టు ఆయన వెల్లడించడం హైలైట్. మరో 4 నెలల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుందట.

ఇటీవలే నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే వారికి ఉచిత విద్యుత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది సంచలనం అయ్యింది. ఆ నిర్ణయం కేజ్రీవాల్ కు బస్తీ ప్రజల్లో విపరీతమైన సానుకూలతను తెచ్చిపెట్టింది.  ఆగష్టు 1 నుంచి పాత కరెంట్ బిల్లులను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడంలో ఈ విద్యుత్తు పథకంలో మరో హైలైట్. అయితే... 201 యూనిట్ల నుంచి 400 యూనిట్ల మధ్య వాడే వారిని కూడా కేజ్రీవాల్ వదల్లేదు. వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అంటే... కేజ్రీవాల్ నిర్ణయం సగానికి పైగా ఢిల్లీ వాసులను నేరుగా ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ పథకం కంటే కూడా కేజ్రీవాల్ లాజిక్ బాగుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉచితంగా విద్యుత్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు... మరి సామాన్యుడికి ఫ్రీగా కరెంట్ ఇస్తే తప్పేంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పైగా బీజేపీ విమర్శలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తూ... దమ్ముంటే మీరు కూడా మహారాష్ట్ర - హర్యానాల్లో ఉచిత కరెంటు ఇవ్వండి అంటూ ఛాలెంజ్ విసిరారు.

ఇదిలా ఉండగా... మొన్న ఢిల్లీ మెట్రో - నగర ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రకటించి సంచలనం అయ్యారు. అయితే, అదింకా అమలుకావడం లేదు. కేజ్రీవాల్ దూకుడు చూస్తుంటే...ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో తిరిగి గెలిచేలా ఉన్నాడు. అయితే... బీజేపీ కూడా అక్కడ ఇటీవల బాగా పుంజుకుంది.
   

Tags:    

Similar News