కొమ్ములు విరిగినా.. భారత్ పై ఎందుకీ రంకెలు.. షకి

Update: 2022-11-01 12:34 GMT
ఒకప్పుడు క్రికెట్ లో పాకిస్థాన్ జట్టుకు దుందుడుకుతనం ఉండేది. అప్పట్లో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఆ జట్టు ప్రదర్శన ఆ తీరున ఉండేది. ప్రవర్తన బాగా లేకున్నా ప్రదర్శనతో అది మరుగున పడేది. అయితే, ఆస్ట్రేలియాకూ కాస్త చెడ్డ పేరున్నా.. అది మైదానంలో దూకుడు మీదనే. దుందుడుకుతనంపై కాదు. ఆసీస్ క్రికెటర్లు కూడా స్లెడ్జింగ్ వంటి వాటికి దిగుతూ ప్రత్యర్థులను రెచ్చగొట్టేవారు. కానీ, సౌరభ్ గంగూలీ వంటి వాడు భారత కెప్టెన్ అయ్యాక ఆసీస్ కొమ్ములు విరిచాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక లీగ్ లు రావడం.. వాటిలో ఆడుతుండడంతో ఆసీస్ ఆటగాళ్ల దూకుడుకు తెరపడింది. ఇక పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా హుందాతనం నేర్చుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే భారత క్రికెటర్లకు వారిప్పుడు పెద్ద అభిమానులు కూడా. కానీ, బంగ్లాదేశ్ ఆటగాళ్ల తీరు మాత్రం కసిగా ఉంటోంది. ఒకప్పుడు భారత్ అంటే పాకిస్థాన్ ఆటగాళ్లు మనసులో ఏదో తెలియని ద్వేషంతో ఉండేవారు. ఇప్పుడదే బంగ్లా దేశీయుల్లోనూ కనిపిస్తోంది.

బంగ్లా విష నాగులా..?

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశ దాదాపు ముగింపునకు వచ్చింది. ఇఖ సెమీ ఫైనల్స్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్‌.. ప్రతి పాయింటూ కీలకం. ఒక్క మ్యాచ్‌ ఓడినా ప్రత్యర్థి జట్లకు అవకాశం ఇచ్చినట్లే. వరుణుడు కాచుకుని ఉన్న పరిస్థితుల్లో బుధవారం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగనుంది. కాగా, భారత్‌తో మ్యాచ్ పై బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబుల్ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ''టీమ్‌ఇండియా ఎక్కడ ఆడినా భారీగా మద్దతు లభిస్తుంది.

భారత్‌ ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. వారు ఇక్కడికి ప్రపంచకప్‌ టైటిల్‌ను నెగ్గేందుకు వచ్చారు. కానీ మేం మాత్రం అలా కాదు. భారత్‌ను ఓడిస్తే పెద్ద సంచలనమే అవుతుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. టాప్‌క్లాస్‌ ప్లేయర్లలో అతడు ఒకడు. మేం ఇంకా మ్యాచ్‌ గురించి చర్చించుకోలేదు.

అయితే అతడిని కట్టడి చేసేందుకు ఏం చేయాలనేదానిపై మాట్లాడుకొంటాం. మ్యాచ్‌ గెలవాలంటే ప్రతి విభాగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది'' అని షకిబ్‌ వెల్లడించాడు. మరోవైపు కప్ గెలవడానికి రాలేదని, భారత్ ను ఓడించాకి వచ్చామని ఉన్నషకిబుల్ మాటలను చూస్తుంటే టీమిండియాపై అతడి భావన ఏమిటో అర్థమవుతోంది. ఇక్కడే కాదు.. నాలుగేళ్ల కిందట జరిగిన నిదహాస్ ట్రోఫీలోనూ బంగ్లా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అయింది.

నాడు లంకలో చేదు అనుభవం

2018లో నిదహాస్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది. లంకను ఓడించి బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరింది. ఈ క్రమంలో లంకపై గెలిచాక బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్ చేసిన తీరు ఆ రెండు దేశాల
అభిమానుల మధ్య విభేదాలకు కారణమైంది.

దీంతో ఫైనల్లో భారత్ చేతిలో బంగ్లా ఓడాక లంక అభిమానులు నాగిని డ్యాన్స్ తో వారిని ఎద్దేవా చేశారు. కాగా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలోనూ తీవ్రంగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి. వారికి అఫ్గానిస్థాన్ ఆటగాళ్లతోనూ అంతగా సత్సంబంధాలు లేవని స్పష్టమవుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News