బీజేపీ మరో పెద్ద టార్గెట్ నే పెట్టుకుంది!

Update: 2019-06-14 01:30 GMT
క్రితం సారి లోక్ సభ ఎన్నికల్లో మంచి ఘన విజయం సాధించాకా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గట్టిగా చేపట్టింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా దేశంలోనే అతి పెద్ద పార్టీగా - ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా నిలిచినట్టుగా ప్రకటించుకుంది బీజేపీ.

దేశ వ్యాప్తంగా అప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏకంగా పది లక్షల మంది కార్యకర్తలను నియమించింది బీజేపీ. అమిత్ షా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం గట్టిగా సాగింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఏకంగా పదకొండు కోట్ల మంది అప్పుడు బీజేపీ సభ్యత్వాలను  తీసుకున్నారట.

తద్వారా అత్యధిక మంది సభ్యులున్న పార్టీ తమదే అని, ఈ విషయంలో తాము ప్రపంచ రికార్డును సృష్టించినట్టుగా కమలం పార్టీ ప్రకటించుకుంది. అయితే ఈ సారి అంతటితో ఆగడం లేదట. త్వరలోనే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుకానుంది. ఈ దఫా మరో ఇరవై శాతం మందికి అధికంగా సభ్యత్వాలను ఇవ్వాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందట.

అంటే మరో రెండు  కోట్ల మందికి పైగా అదనంగా పార్టీ సభ్యత్వాలను ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుందట. ప్రస్తుతం కమలం పార్టీ ఊపును చూస్తే.. అదేం అంత కష్టం అయ్యేలా లేదని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News