జియో ఎఫెక్ట్: బీఎస్ ఎన్ ఎల్ స‌మ్మె..ఇర‌కాటంలో మోడీ

Update: 2018-11-30 09:04 GMT
దాదాపు రెండేళ్ల‌ క్రితం 4జీ ఉచిత సేవలతో రంగప్రవేశం చేసిన రిల‌య‌న్స్‌ జియో ధాటికి దేశీయ టెలికం రంగ ముఖచిత్రమే మారిపోయిన విషయం తెలిసిందే. అనూహ్య‌మైన‌ అనేక ఆఫ‌ర్లు ఇచ్చిన జియో వైపు వినియోగ‌దారులు మొగ్గు చూపారు. దీంతో మిగ‌తా సంస్థ‌లు షాక్ తిన్నాయి. కొన్ని సంస్థ‌లు అయితే త‌మ వ్యాపారాన్నినిర్వ‌హించ‌లేక ఇత‌ర సంస్థ‌ల్లో క‌లిసిపోయాయి. అయితే. ఈ ఒర‌వ‌డి కార‌ణంగా సంచ‌ల‌న ప‌రిణామం ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. డిసెంబర్ 3వ తేదీ నుండి సమ్మెకు దిగనున్నారు. సమ్మెతో టెలికారంగంలో ప్రభుత్వం..ప్రైవేటు కంపెనీల మధ్య వార్ ప్రారంభమైనట్లు చెప్పవచ్చు.

టెలికాం కంపెనీల సంక్షోభానికి రిలయన్స్ జియోనే కారణమని బీఎస్ ఎన్ ఎల్ పేర్కొంటోంది. జియోతో పోటీ పడకుండా ఉండేందుకు బీఎస్ ఎన్ ఎల్ కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖేష్ అంబానీకి మోడీ సర్కార్ వత్తాసు పలుకుతోందని..ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టనున్నట్లు బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ముఖేష్ అంబానీ కంపెనీకి లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం నిబంధనలు కూడా ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు మూతపడిన తరువాత రిలయెన్స్ జియో - టారిఫ్‌ లను భారీగా పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకసారి మార్కెట్‌ లో పోటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన అనంతరం జియో కస్టమర్లను భారీగా దోపీడీ చేయనుందని బీఎస్ ఎన్ ఎల్ పేర్కొంటోంది. డిసెంబర్ 3వ తేదీ నుండి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు బీఎస్ ఎన్ ఎల్‌ కు చెందిన పలు సంఘాలు నిర్ణయించాయి. కాగా, బీఎస్‌ ఎన్‌ ఎల్ ఆరోపణలపై రిలయన్స్ జియో స్పందించలేదు.

Tags:    

Similar News