కేసీఆర్ చేతిలో పచ్చ బొకే పెట్టిన చంద్రబాబు

Update: 2015-10-23 04:29 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయటంతో పాటు.. అత్యంత మర్యాదగా వ్యవహరించి.. తమ ఇంటికి వచ్చిన విశిష్ఠ అతిధిని అపూర్వంగా ఆదరించిన వైనం అందరిని ఆకర్షించటం తెలిసిందే.

అయితే.. ఇంత చక్కగా ఆదరించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఒక అంశం కాస్త ఆసక్తికరంగా కనిపించింది. ప్రధాని మోడీ వేదిక మీదకు వచ్చిన సందర్భంగా డయాస్ మీద ఆసీనులైన అతిధులందరికి పూలబొకేలను చంద్రబాబు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి వేర్వేరు రంగులున్న పూల బొకేల్ని చేతికి ఇచ్చిన చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాత్రం కాస్తంత భిన్నమైన బొకేను ఇవ్వటం కనిపించింది.

మిగిలిన అతిధులకు రెండు రంగులున్న గులాబీ పూల బొకేలు.. ఒకే రంగున్న బొకేలు ఇవ్వగా.. కేసీఆర్ కు మాత్రం పసుపు పచ్చ గులాబీ బొకే ఇవ్వటం గమనార్హం. చంద్రబాబు పార్టీ రంగు అయిన పసుపు రంగు పూల గుత్తినే కేసీఆర్ చేతిలో పెట్టటం గమనార్హం. అనుకోకుండా జరిగిందా? లేక.. కేసీఆర్ చేతికే పసుపు పూల బొకే వచ్చిందా అన్నది బాబు అండ్ కోకే తెలియాలి.
Tags:    

Similar News